బాలిక ప్రాణం తీసిన సోషల్ మీడియా ఛాలెంజ్.. ఊపిరి బిగబట్టి మరీ..
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:16 PM
అమెరికాలోని టెక్సాస్లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఛాలెంజ్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఛాలెంజ్లో భాగంగా ఆ బాలిక మెడకు తాడు బిగించుకోవటంతో ఊపిరి ఆడక చనిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ఛాలెంజ్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఛాలెంజ్లో భాగంగా ఆ బాలిక మెడకు తాడు బిగించుకోవటంతో ఊపిరి ఆడక చనిపోయింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బాలిక తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు.. టెక్సాస్కు చెందిన కర్టీస్, వెండీ బ్లాక్వెల్ దంపతుల 9 ఏళ్ల కూతురు జాక్లిన్ కే బ్లాక్వెల్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉండేది. రీల్స్, షార్ట్స్ చూస్తుండేది. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ‘బ్లాక్ అవుట్’ ఛాలెంజ్ వీడియోను చూసింది.
ఆ వీడియోను అమ్మమ్మకు చూపించింది. ఆ వీడియోను చూసి పెద్దావిడ భయపడిపోయింది. అలాంటి వాటి జోలికి పోవద్దని బాలికను హెచ్చరించింది. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం జాక్లిన్ ఆడుకోవటానికి ఇంటి వెనకాల ఉన్న స్థలంలోకి వెళ్లింది. ఎంత సేపటికి బాలిక ఇంటి లోపలికి తిరిగిరాకపోవటంతో తల్లి అక్కడికి వెళ్లింది. అక్కడి దృశ్యం చూసి ఆమె షాక్ అయింది. జాక్లిన్ గొంతుకు తాడు బిగించుకుని పడిపోయి ఉంది. తల్లి పరుగున బాలిక దగ్గరకు వెళ్లింది. మెడకు ఉన్న తాడును తీసిపడేసింది. చలనం లేకుండా పడిఉన్న కూతురిని రక్షించుకోవడానికి సీపీఆర్ కూడా చేసింది.
అంబులెన్స్ సాయంతో బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. జాక్లిన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై జాక్లిన్ తల్లి కర్టీస్ మాట్లాడుతూ.. ‘నేను చాలా భయపడిపోయాను. నేనెప్పుడూ అంత షాకింగ్ దృశ్యం చూడలేదు. నా కూతురిని అలాంటి పరిస్థితిలో చూడ్డానికి నాకు భయం వేసింది. తనను కాపాడటానికి చాలా ప్రయత్నించాను. కానీ, లాభం లేకుండా పోయింది. మీ పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచండి. సోషల్ మీడియా అల్గారిథమ్ చాలా దారుణంగా పని చేస్తుంది. వాటిని అలా తయారు చేశారు. పసి పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం ముమ్మాటికీ ఆ కంపెనీలే’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఐఆర్జీసీ అధికార ప్రతినిధి అలీ మహమ్మద్ నయీని మృతి
అంకెల ఆర్భాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే: బండి సంజయ్