యుద్ధం ముగింపునకు వచ్చింది: రష్యా అధ్యక్షుడు
ABN , Publish Date - May 10 , 2026 | 11:10 AM
ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు చేరుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విక్టరీ డే వేడుక సందర్భంగా మీడియాతో ఈ కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం త్వరలో ముగియనుందని అన్నారు. యుద్ధం మొదలైన దాదాపు నాలుగేళ్ల తరువాత చర్చలకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘ఈ వ్యవహారం ముగింపునకు వచ్చిందని అనుకుంటున్నా’ అని మాస్కోలో జరిగిన రష్యా విక్టరీ డే కార్యక్రమంలో పుతిన్ అన్నారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ప్రతిపాదన ప్రకారం, రష్యా, ఉక్రెయిన్లు మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక తమకు చిక్కిన 1000 మంది ప్రత్యర్థి దేశ సైనికులను కూడా విడుదల చేసేందుకు ఉక్రెయిన్, రష్యాలు అంగీకరించాయి.
పుతిన్ వ్యాఖ్యలపై ఐరోపా అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది. ‘చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు ప్రపంచానికి చెప్పదలుచుకున్నారు’ అని పుతిన్ తాజా వ్యాఖ్యలపై ఐరోపా దౌత్యవేత్త ఒకరు కామెంట్ చేశారు. ఇక ఈసారి విక్టరీ డే కార్యక్రమాలు కూడా గతంతో పోలిస్తే భిన్నంగా సాగాయి. ప్రపంచాన్ని అబ్బురపరిచేలా సైనిక శక్తిని ప్రదర్శించే రష్యా ఈమారు కాస్తంత సాధారణ రీతిలో కార్యక్రమాలను నిర్వహించింది. తాజా కార్యక్రమంలో యుద్ధ ట్యాంకుల ప్రదర్శన నిర్వహించలేదు. భారీ స్క్రీన్పై మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్ను మాత్రమే చూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు కవాతు నిర్వహించారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్లో ఒక్కసారిగా పేలిన బోటు.. ఎగిరిపడిన ప్రయాణికులు..
అమెరికాలో విషాదం.. రన్వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం