ఆ రిపోర్ట్ పచ్చి అబద్ధం: పీట్ హెగ్సెత్
ABN , Publish Date - Sep 19 , 2026 | 10:04 AM
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైనికుల మరణాల సంఖ్యపై వివాదం నెలకొంది. కనీసం 22 మంది అమెరికా సైనికులు మరణించారని అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. అయితే, 18 మంది సైనికులే చనిపోయారని పెంటగాన్ పబ్లిక్ డేటా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో 22 మంది అమెరికా సైనికులు చనిపోయారన్నది పూర్తిగా అబద్ధమని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. ఇరాన్తో యుద్ధంలో అంతమంది అమెరికా సైనికులు చనిపోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. ఇరాన్తో యుద్ధంలో 22 మంది అమెరికా సైనికులు చనిపోయారంటూ వాషింగ్టన్ పోస్ట్ ఇచ్చిన నివేదికను ఆయన కొట్టివేశారు. వాషింగ్టన్ పోస్టు నివేదికను ఒక తప్పుడు నివేదికగా పీట్ అభివర్ణించారు.
అధికారులే చెప్పారు: వాషింగ్టన్ పోస్ట్
ఇరాన్తో యుద్ధంలో 22 మంది యూఎస్ సైనికులు చనిపోయారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారులే చెప్పారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. పెంటగాన్ పబ్లిష్ చేసిన డేటా కన్నా మరో నలుగురు ఎక్కువ చనిపోయారని ఆ అధికారులు వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాకుండా మరింత మంది సైనికులు కూడా చనిపోయి ఉండవచ్చని ఆ కథనం వెలువరించింది.
కాగా.. 18 మంది అమెరికా సైనికులే చనిపోయినట్లు పెంటగాన్ డేటా తెలిపింది. అయితే, ఇరాన్తో చేస్తున్న యుద్ధంలోనే అంతమంది అమెరికా సైనికులు చనిపోయి ఉంటారని భావించడానికి వీలు లేదని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక తెలిపింది. ‘పశ్చిమాసియా గత కొన్నేళ్లుగా యుద్ధం, అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ విధులు నిర్వహిస్తున్న అమెరికా సైనికులు కొంతమంది చనిపోయారు. ఆ సైనికుల మరణాలతో కలిపి 22 మంది చనిపోయి ఉండవచ్చు’ అని వాషింగ్టన్ పోస్ట్ కథనం వివరించింది. సైనికుల మరణాల్లో తేడాను వెల్లడించాలని తాము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి పెంటగాన్ నిరాకరించిందని ఆ పత్రిక పేర్కొంది.