మక్కా ఒప్పందాన్ని మర్చిపోయారా? హౌతీలకు పాక్ మంత్రి వార్నింగ్
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:27 PM
సౌదీపై దాడులు చేస్తున్న యెమెన్ తిరుగుబాటుదారులు హౌతీలకు పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా గట్టి హెచ్చరిక చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీపై దాడులు చేస్తున్న యెమెన్ తిరుగుబాటుదారులు హౌతీలకు పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా గట్టి హెచ్చరిక చేశారు. సౌదీపై దాడులను పాక్పై దాడిగా భావించి ప్రతిదాడులకు దిగుతామని హెచ్చరించారు. సౌదీ, తుర్కియే, పాక్ మధ్య ఇటీవల మక్కా ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేశారు. తమలో ఏ ఒక్కరిపై దాడి జరిగినా మిగతా వారిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామన్న విషయాన్ని మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. మక్కా ఒప్పందాన్ని క్రియాశీలకం చేస్తామని అన్నారు.
మక్కా ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. సౌదీ అరేబియాకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. మక్కా ఒప్పందంలో భాగమైన మూడు దేశాలు తమంతట తాము ఎవరిపైనా దాడులు చేయవని కూడా పాక్ మంత్రి చెప్పుకొచ్చారు. ఎవరైనా దాడులకు దిగితే మాత్రం ఒక్కటిగా స్పందిస్తామని అన్నారు. యెమెన్లో అంతఃకలహాలను సౌదీకి వ్యాప్తి చేసే ప్రయత్నం చేయవద్దని హౌతీలను హెచ్చరించారు. అంతకుముందు, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా హౌతీ దాడులను ఖండించారు.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు మంగళవారం సౌదీ భూభాగంలో దాడులు నిర్వహించారు. మిసైల్స్, డ్రోన్స్తో దాడులు చేశారు. సౌదీకి చెందిన ఇంధన, ఆర్థిక రంగ మౌలిక వసతులను టార్గెట్ చేశారు. ఈ దాడుల్లో సుమారు 73 మంది గాయపడినట్టు తెలుస్తోంది. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ దాడులు చేయడంతోనే తాము ప్రతిదాడులకు దిగామని హౌతీలు చెబుతున్నారు. 2014 నుంచి హౌతీలకు, యెమెన్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, సౌదీ మాత్రం యెమెన్ ప్రభుత్వానికే అండగా ఉంటుంది. ఇక పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ దాడులు పెరగడంతో ఇటీవల సౌదీ మక్కా ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ చేతిలో యూఎస్ అండర్ వాటర్ డ్రోన్!
ఇరాన్ నౌకలపై విరుచుకుపడ్డ అమెరికా.. ఐదు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..