పాకిస్థాన్ మసీదులో దారుణం.. 16 మంది మృతి
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:15 PM
పాకిస్థాన్లోని ఓ మసీదులో శుక్రవారం నమాజ్ సమయంలో ఆత్మాహుతి పేలుడు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకూ 16 మంది చనిపోగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 18: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, కొహాట్ జిల్లాలోని ఓ మసీదులో శుక్రవారం నమాజ్ సమయంలో సంభవించిన శక్తిమంతమైన ఆత్మాహుతి పేలుడు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
కొహాట్ జిల్లాలోని ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న మసీదులో శుక్రవారం ప్రార్థనలు (జుమా నమాజ్) జరుగుతుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మసీదు భవనంతో పాటు సమీపంలోని భవనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో మసీదు శిథిలాల నుంచి గాయపడిన వారిని రక్షించే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రాథమికంగా 8 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 16కు చేరింది. వీరిలో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నారు. 50 మందికి పైగా గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
'రెస్క్యూ 1122' సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
ఇవీ చదవండి:
పైథాన్ను ఇట్టే పట్టేసి.. చేతికి చుట్టేసిన ఐటీ ఉద్యోగి.!
గ్రిల్లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు.. వీడియో వైరల్