ఆయిల్ సంక్షోభం.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:17 PM
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పాకిస్థాన్ చిక్కుల్లో పడిపోయింది. ఆ దేశంలో ఆయిల్ సంక్షోభం తీవ్ర తరమైంది. ఆయిల్ దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పాకిస్థాన్ చిక్కుల్లో పడిపోయింది. ఆ దేశంలో ఆయిల్ సంక్షోభం తీవ్ర తరమైంది. ఆయిల్ దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో దేశ ప్రజలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా పెంచేసింది. పెట్రోల్ ధర 42.7 శాతం.. డీజిల్ ధర 54.9 శాతం పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ గురువారం ప్రకటించారు.
శుక్రవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అలీ మాలిక్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రస్తుతం పెట్రోల్ ధర 458.40 రూపాయలుగా ఉంది. ఇక, డీజిల్ విషయానికి వస్తే.. ప్రజా రవాణా, ఇతర వాహనాల విషయంలో డీజిల్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి డీజిల్ ధర ప్రస్తుతం 520.35 రూపాయలుగా ఉంది. శుక్రవారం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు.
బంగ్లాదేశ్ ఆయిల్, గ్యాస్ కొరత తీవ్రతరం..
యుద్ధం కారణంగా బంగ్లాదేశ్లో ఆయిల్, గ్యాస్ సంక్షోభం నెలకొంది. దేశంలో సరిపడా ఆయిల్, గ్యాస్ నిల్వలు లేకపోవటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఎల్పీజీ ధరలు 29 శాతం పెరిగాయి. కాగా, ఇండియా ఓ ఒప్పందం మేరకు పైప్లైన్ ద్వారా వేల లీటర్ల డీజిల్ను బంగ్లాదేశ్కు సరఫరా చేస్తోంది. ఆయిల్ కొరత నేపథ్యంలో.. ఒప్పందం కంటే ఎక్కువ డీజిల్ సరఫరా చేయాలని బంగ్లాదేశ్.. భారత్ను కోరుతోంది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ టీటీడీ ఆలయంలో 13 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..