అఫ్గానిస్థాన్పై యుద్ధం ప్రకటించిన పాక్
ABN , Publish Date - Feb 27 , 2026 | 09:18 AM
అఫ్గానిస్థాన్పై పాక్ యుద్ధం ప్రకటించింది. తమ సహనం నశించిందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఎక్స్ వేదికగా స్పందించారు. కాబుల్, కాందహార్ సహా పలు ప్రాంతాల్లోని అఫ్గాన్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా శుక్రవారం పాక్ వైమానిక దాడులకు దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలు కొత్త మలుపు తిరిగాయి. తమ సహనం నశించిందని చెప్పిన పాక్.. ఇక యుద్ధమేనని ప్రకటించింది. ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. మీకూ, మాకూ మధ్య యుద్ధమే అని పోస్టు పెట్టారు. అఫ్గానిస్థాన్లోని కాబుల్, కాందహార్ నగరాలపై పాక్ దాళాలు వైమానిక దాడులకు దిగాయి. అంతకుముందు తాలిబన్లు పాక్ సైనికులను హతమార్చిన నేపథ్యంలో శుక్రవారం పాక్ ప్రతీకారానికి దిగింది. ఘజబ్ లిల్ హక్ పేరిట ఈ మిలిటరీ ఆపరేషన్కు తెరతీసింది (Afghanistan - Pak Open War).
శుక్రవారం.. రాజధాని కాబుల్లో మూడు చోట్ల పాక్ వైమానిక దాడులు చేసింది. అయితే, ఏయే ప్రాంతాలను టార్గెట్ చేసిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కాందహార్పై కూడా పాక్ వైమానిక దాడులు చేసిందని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. కాబుల్, కాందహార్, పక్టియా ప్రాంతాల్లోని అఫ్గాన్ మిలిటరీ స్థావరాలే టార్గెట్గా పాక్ ఈ దాడులు చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ దాడుల్లో కాబుల్లోని రెండు మిలిటరీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయని పాక్ మీడియా పేర్కొంది. కాందహార్లోని మిలిటరీ స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపింది.
గురువారం పాక్లో సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలపై అఫ్గానిస్థాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. గత ఆదివారం తమ భూభాగాలపై పాక్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు అఫ్గానిస్థాన్ తెలిపింది. అయితే, అమాయక పౌరులపై అఫ్గానిస్థాన్ దాడి చేసిందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసీన్ నఖ్వీ మండిపడ్డారు.
ఇక తాము జరిపిన దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. శుక్రవారం తమ గగనతలంలోకి వచ్చిన రెండు పాక్ విమానాలను కూడా కూల్చేశామని తెలిపారు. ఈ ప్రకటనలను పాక్ ఖండించింది. అఫ్గాన్ సైనికులే 133 మంది చనిపోయారని, మరో 200 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది.
ఇవీ చదవండి:
డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడికి ఎప్స్టీన్ దెబ్బ!