నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్పై వేటు
ABN , Publish Date - May 20 , 2026 | 07:48 AM
పత్రికా స్వేచ్ఛపై తన ప్రశ్నలకు ప్రధాని మోదీ జవాబు చెప్పలేదంటూ సోషల్ మీడియాలో కలకలం రేపిన నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్ స్వెండ్సన్ సోషల్ మీడియా అకౌంట్స్పై వేటు పడింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో మీడియా స్వేచ్ఛపై తన ప్రశ్నలకు ప్రధాని మోదీ బదులివ్వలేదంటూ కలకలం రేపిన నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్ స్వెండ్సన్ సోషల్ మీడియా అకౌంట్స్పై వేటు పడింది. తన ఇస్టా, ఫేస్బుక్ అకౌంట్స్ సస్పెన్షన్కు గురైనట్టు ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. పత్రికా స్వేచ్ఛ కోసం తాను ఈ చిన్న మూల్యాన్ని చెల్లించేందుకు సిద్ధమేనని కూడా అన్నారు. అయితే, ఇలాంటిది తాను గతంలో ఎన్నడూ చూడలేదని కూడా వ్యాఖ్యానించారు. తన అకౌంట్స్ సస్పెన్షన్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘నేను భారతీయుల ప్రశ్నలకు సమాధానం ఇద్దామనే అనుకున్నా. కానీ ఇందులో కాస్త జాప్యం జరగనుంది. నా అకౌంట్స్పై సస్పెన్షన్ను ఎత్తేస్తారనే ఆశిస్తున్నా’ అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు.
నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్తో కలిసి సంయుక్త ప్రకటన అనంతరం ప్రధాని మోదీ తిరిగెళుతున్న సమయంలో స్వెండ్సన్ ప్రధాని మోదీని మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం నార్వే ప్రధానితో కలిసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్లో పోస్టు చేస్తూ తన ప్రశ్నకు బదులేదని ప్రశ్నించారు.
స్వెండ్సన్ ప్రశ్నలకు విదేశాంగ శాఖ సెక్రటరీ సిబి జార్జ్ జవాబిచ్చారు. స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ భారత రాజ్యాంగ విలువలని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఉందని అన్నారు. భారత దేశ స్థాయి ఏమిటనేదానిపై కొందరికి అవగాహన లేదని కూడా అన్నారు. హక్కుల ఉల్లంఘనలు గురైన వారు భారత కోర్టులను ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని అన్నారు.
ఈ ఉదంతంతో స్వెండ్సన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. అనేక మంది ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమె చైనా తాబేదారు అని మండిపడ్డారు. చైనాను సూపర్ పవర్గా కీర్తిస్తూ, చైనా అధినేతను పొగడ్తల్లో ముంచెత్తుతూ గతంలో ఆమె రాసిన కథనాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐతో ఉద్యోగ సంక్షోభం: ఆంత్రోపిక్ సీఈవో
మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ? కలకలం రేపుతున్న నార్వే జర్నలిస్టు ఉదంతం