విమానం చక్రాల్లో మంటలు.. ల్యాండింగ్ సమయంలో ఘటన.. వైరల్ వీడియో
ABN , Publish Date - May 11 , 2026 | 09:27 AM
టర్కీకి చెందిన ఒక విమానం సోమవారం నేపాల్లో ల్యాండవుతున్న సమయంలో చక్రాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన తాలూకు వీడియో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ల్యాండింగ్ సమయంలో విమానం చక్రాల్లో మంటలు చెలరేగిన ఘటన నేపాల్లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. రాజధాని ఖఠ్మాండూలోని త్రిభువన్ దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. అయితే, ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారనే అధికారులు తెలిపారు.
ఇస్తాంబుల్ నుంచి ఖఠ్మాండూకు వచ్చిన విమానం ల్యాండవుతున్న సమయంలో కుడివైపు చక్రాలకు మంటలు అంటుకున్నాయి. చక్రాల నుంచి దట్టమైన పొగ వచ్చింది. ఇక విమానం ల్యాండవగానే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ తలుపు నుంచి సురక్షితంగా కిందకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో 278 మంది ప్యాసింజర్లు, 11 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది కూడా విమానంలో ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు కారణమేంటో ఇంకా తెలియరాలేదు. ఎయిర్లైన్స్ కూడా ఈ ఉదంతంపై ఇంకా స్పందించాల్సి ఉంది. త్రిభువన్ దాస్ ఎయిప్పోర్టులో గతంలో కూడా టర్కీ విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. 2015లో ల్యాండింగ్ సమయంలో ఒక విమానం బ్యాలెన్స్ తప్పి రన్వేపై నుంచి జారీ పక్కకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఎయిర్పోర్టును నాలుగు రోజుల పాటు మూసేయాల్సి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
నాకు అస్సలు నచ్చలేదు.. ఇరాన్ ప్రతిపాదనలకు నో చెప్పిన ట్రంప్!
సముద్రంలో చమురు పారబోస్తున్న ఇరాన్?