Share News

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..

ABN , Publish Date - Aug 27 , 2026 | 07:01 AM

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్ సరిహద్దుకు సమీప ప్రాంతాల్లో ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..
Nepal Flash floods

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్ సరిహద్దుకు సమీప ప్రాంతాల్లో ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో ఇప్పటివరకు 157 మంది మరణించారు. వందల మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో భారతీయ యాత్రికులు కూడా చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది (Nepal Flash floods).


కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. కైలాష్ మానసరోవర్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పలువురు భారతీయ యాత్రికులు వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. 133 మంది భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం నేపాల్ భద్రతా బలగాలు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి (Kailash Mansarovar pilgrims).


భారీ వర్షాలు, కొండ ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా భోటే కోషి నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేపాల్‌లోని రసువా, ధాదింగ్, నువాకోట్ తదితర ప్రాంతాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, మౌలిక సదుపాయాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది (Indian pilgrims missing).


వరదల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి (Nepal flood deaths). అనేక ప్రాంతాలకు అధికారులు పూర్తిగా చేరుకోలేకపోవడంతో మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన..

నేపాల్‌లో భయంకర వరదలు సృష్టించిన విధ్వంసం కలచివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. 150 మందికి పైగా యాత్రికులు గల్లంతు కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన, గల్లంతైన వారికి తక్షణ సహాయం అందాలని ఆకాంక్షించారు. నేపాల్‌కు సహాయం అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 27 , 2026 | 08:11 AM