Share News

మళ్లీ భీకర పోరు

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:10 AM

పశ్చిమాసియా మళ్లీ రణరంగమైంది. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్‌ మంగళవారం కూల్చివేయటంతో దాడులు, ప్రతిదాడులతో పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతం అట్టుడికింది.

మళ్లీ భీకర పోరు

  • ఇరాన్‌, అమెరికా మధ్య హెలికాప్టర్‌ కూల్చివేత చిచ్చు

  • ఇరాన్‌లో 20 ప్రాంతాలపై అమెరికా బాంబులు

  • జోర్డాన్‌, బహ్రెయిన్‌, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు

దుబాయి, జూన్‌ 10: పశ్చిమాసియా మళ్లీ రణరంగమైంది. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్‌ మంగళవారం కూల్చివేయటంతో దాడులు, ప్రతిదాడులతో పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతం అట్టుడికింది. తమ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా ఇరాన్‌లోని గగన ర క్షణ, రాడార్‌ వ్యవస్థలు, మిలిటరీ కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 20 చోట్ల దాడులు నిర్వహించింది. జాస్క్‌, బందర్‌ అబ్బాస్‌ పోర్టు, ఖెష్మ్‌ ద్వీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్‌కు చెందిన టాస్నిమ్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అమెరికాకు ఇరాన్‌ కూడా దీటుగా బదులిచ్చింది. కువైట్‌, బహ్రెయిన్‌, జోర్డాన్‌లలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. పర్షియన్‌ గల్ఫ్‌కు దూరంగా ఇజ్రాయెల్‌తో సరిహద్దుగల జోర్డాన్‌ను తాజా ఘర్షణల్లో ఇరాన్‌ లక్ష్యంగా ఎంచుకోవటం గమనార్హం. జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ కేంద్రాలపై దాడి చేసింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి కువైట్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్న ఇరాన్‌.. బుధవారం మరోసారి వరుస దాడులు చేసింది. ఆ దేశంలోని అమెరికాకు చెందిన అల్‌ ఉదీద్‌ ఎయిర్‌ బేస్‌పై క్షిపణులు ప్రయోగించింది. వీటిని తమ గగన రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకొని కూల్చివేసినట్లు కువైట్‌ సైన్యం ప్రకటించింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరం ఫిఫ్త్‌ ఫ్లీట్‌పై కూడా ఇరాన్‌ దాడి చేసింది. అయితే, ఇరాన్‌ దాడుల్లో ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది తెలియరాలేదు. ఇరాన్‌ దాడులను ఖతార్‌, యూఏఈ, ఈజిప్టు ఖండించాయి.

2.jpg


క్షేమంగా ఉండాలంటే వెళ్లిపోండి: ఇరాన్‌

అమెరికా హెలికాప్టర్‌ కూల్చివేతను ఇరాన్‌ సమర్థించుకుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని ఆర్టికల్‌ 51 ప్రకారం తమకు ఆత్మరక్షణ హక్కు ఉందని బుధవారం పేర్కొంది. ‘అమెరికన్లు సురక్షితంగా ఉండాలంటే పశ్చిమాసియా ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందే’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు కూడా కఠిన హెచ్చరికలే జారీచేశారు. ఇరాన్‌ దుందుడుకు చర్యలతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోందని విమర్శించారు. చర్చలకు ఇరాన్‌ చాలా సమయం తీసుకుందని, ఇక ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. దీంతో యుద్ధం మళ్లీ భీకరంగా మారుతుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అంతా అల్లకల్లోలం

ఏప్రిల్‌ రెండోవారంలో అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో గత రెండు నెలలుగా పశ్చిమాసియాలో చెదురుమొదురు ఘటనలు మినహా పెద్దగా ఘర్షణలు చోటుచేసుకోలేదు. అప్పటి నుంచి శాశ్వత శాంతి కోసం రెండు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో గల్ఫ్‌ దేశాల్లో పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి వచ్చాయి. కానీ, తాజా దాడులతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పర్యాటకం, పౌర విమానయాన రంగాలు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మంగళవారం నుంచి సౌదీ, ఖతార్‌, కువైట్‌, జోర్డాన్‌, యూఏఈ, బహ్రెయిన్‌ తదితర దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు.

Updated Date - Jun 11 , 2026 | 06:01 AM