ఇక పూర్తిస్థాయి యుద్ధం!
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:27 AM
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రెండుదేశాలు సు దీర్ఘకాలం పోరాటం చేసేందుకు అవసరమైన మిలిటరీ మౌలిక వసతులను...
సై అంటే సై అంటున్న ఇరాన్, అమెరికా
దుబాయ్, జూలై 18: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రెండుదేశాలు సు దీర్ఘకాలం పోరాటం చేసేందుకు అవసరమైన మిలిటరీ మౌలిక వసతులను వేగంగా సమకూర్చుకుంటున్నాయి. పూర్తిస్థాయి యుద్ధానికి సంబంధించిన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సేథ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ సమర్పించినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. ఆ ప్రణాళికకు ట్రంప్ అనుమతి ఇవ్వగానే ఇరాన్పై విరుచుకుపడేందుకు ఆ దేశ మిలిటరీ సిద్ధమవుతోంది. అందు లో భాగంగా ఇజ్రాయెల్లోని బెన్ గురియన్, రమన్ విమానాశ్రయాల్లో మరిన్ని అమెరికా ఆయిల్ రీఫ్యూయలింగ్ విమానాలను మోహరిస్తున్నట్లు సమాచా రం.
ఇప్పటికే ఈ రెండు విమానాశ్రయాల్లో దాదాపు 30 చొప్పున ఇలాంటి విమానాలున్నట్లు తెలిసింది. మరోవైపు కువైట్, సౌదీ, జోర్డాన్, బహ్రెయిన్ , ఖతార్, ఇరాక్లోని తన మిలిటరీ స్థావరాలకు మరిన్ని శక్తిమంతమైన క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను తరలిస్తోంది. అమెరికా పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా తన సర్వశక్తులూ కూడదీసుకుంటోంది. ముఖ్యంగా తన పొరుగున ఉన్న అమెరికా మిత్రదేశాలపైనే ఇరాన్ గురిపెట్టింది. కువైట్, ఖతార్, జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులు, డ్రోన్లను భారీగా ఎక్కుపెట్టింది. భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అమెరికాతో ఇక ఎలాంటి చర్చలు ఉండబోవని ప్రకటించింది. కాగా, ఇరాన్-అమెరికా మధ్య శనివారం కూడా భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ దాడుల్లో జోర్డాన్లో శనివారం ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు.
ఇవి కూడా చదవండి
దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు