ఖమేనీ మరణాంతరం మసీదుపై ఎర్రజెండా.. ఇది దేనికి సంకేతం
ABN , Publish Date - Mar 01 , 2026 | 08:07 PM
ఇరాన్లో మతపరంగా ప్రాధ్యానం కలిగిన ఖుమ్ నగరంలోని జంకరాన్ మసీదుపై ఎరుపు జెండా ఎగురవేశారు. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన వార్త తెలియగానే ఈ మసీదుపై జెండా ఎగురవేసిన్నట్టు పలు కథనాలు వెలువడుతున్నాయి.
టెహ్రాన్: ఇరాన్లో మతపరంగా ప్రాధ్యానం కలిగిన ఖుమ్ నగరంలోని జంకరాన్ మసీదు (Jamkaran Mosque)పై ఎరుపు జెండా ఎగురవేశారు. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన వార్త తెలియగానే ఈ మసీదుపై జెండా ఎగురవేసిన్నట్టు పలు కథనాలు వెలువడుతున్నాయి. న్యాయం, ప్రతీకారానికి సంకేతంగా ఈ జెండా ఎగురవేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఖమేని హత్యానంతరం మద్యప్రాచ్యంలో ఆయన మద్దతుదారుల్లో ప్రతీకార ఆగ్రహం చెలరేగుతోందనడానికి ఇది (flag of revenge) నిదర్శనంగా చెబుతున్నారు.
కర్బలా యుద్ధం..
కర్బలా యుద్ధం తరువాత క్రీ.శ.680లో ఇలా మసీదుపై జెండా ఎగురవేసినట్టు చరిత్ర చెబుతోంది. ఆ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమాన్ హుస్సేన్ హతమయ్యాడని చెబుతారు. షియా సాంప్రదాయ ప్రకారం పగ తీర్చుకున్నాకే జెండా తొలగిస్తారు.
అమెరికా దాడుల్లో ఖమేనీ హతం
టెహ్రాన్పై శనివారం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన గగనతల దాడుల్లో ఖమేనీ, ఆయన సైన్యంలోని కీలక వ్యక్తులు మృతి చెందారు. ఖమేనీ మృతిని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఖమేనీ మృతి వార్తతో భారత్ సహా పలు దేశాల్లో నిరసనలు, నివాళులు చోటుచేసుకున్నాయి. ప్రపంచ చరిత్రలోని అత్యంత దుర్మార్గుల్లో ఖమేనీ ఒకరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరాన్ ప్రజలకు ఇంతకంటే మంచి అవకాశం రాదన్నారు. ఖమేనీ చనిపోయారనటానికి చాలా సంకేతాలు ఉన్నాయని, ప్రజలు తమ భవిష్యత్తు కోసం సైన్యంతో కలిసి ఖమేనీ పాలనకు ముగింపు పలకాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. కాగా, ఖమేనీ మరణాంతరం 66 ఏళ్ల షియా సీనియర్ మతాధికారి అయతుల్లా అరాఫీని తాత్కాలిక సుప్రీం నేతగా ఎంపిక చేసినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునేంత వరకూ అరాఫీ తాత్కాలిక నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఇక ఆపండి.. ఖమేనీ మృతిపై చైనా, నార్త్ కొరియా తొలి రియాక్షన్
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలిరేజా అరాఫీ