వెస్ట్బ్యాంక్ను తాకిన ఇరాన్ క్షిపణి.. ముగ్గురు పాలస్తీనా మహిళలు మృతి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:37 PM
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య వెస్ట్బ్యాంక్పై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్ క్షిపణి శకలాలు హీబ్రోన్ సమీపంలోని బేత్ అవా పట్టణంలో పడటంతో ముగ్గురు పాలస్తీనా మహిళలు మరణించినట్టు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య వెస్ట్బ్యాంక్ (West Bank)పై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్ క్షిపణి శకలాలు హీబ్రోన్ సమీపంలోని బేత్ అవా పట్టణంలో పడటంతో ముగ్గురు పాలస్తీనా మహిళలు మరణించినట్టు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఈ దాడిలో ఒక హెయిర్ సెలూన్ సైతం దెబ్బతింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంలో పాలస్తీనీయులు మరణించడం ఇదే మొదటిసారి.
ఇరాన్ క్షిపణి దాడిలో సుమారు ఎనిమిది మంది గాయపడ్డారని, వీరిలో ఒక మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రెడ్ క్రెసెంట్ తెలిపింది. క్షిపణి శకలాలు హెబ్రోన్ సిటీతో పాటు వెస్ట్బ్యాంక్ వెంబడి పలు ప్రాంతాల్లో పడినట్టు అధికార పాలస్తీనా వార్తా సంస్థ 'వఫా' తెలిపింది. కాగా, ఇరాన్ క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని విదేశీ కార్మికుడు ఒకరు మరణించినట్టు ఇజ్రాయెల్ వైద్యులు ప్రకటించారు. మృతి చెందిన వ్యక్తిని తమ దేశ పౌరుడుగా థాయ్లాండ్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. దీంతో ఇంతవరకూ జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్లో మృతిచెందిన వారి సంఖ్య 15కు చేరింది.
క్లస్టర్ బాంబులు
కాగా, ఇరాన్ నుంచి దూసుకువచ్చిన కొన్ని క్లస్టర్ ఆయుధాలు గాలిలోనే పేలిపోయి శకకాలు సువిశాల ప్రదేశాల్లో పడినట్టు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. క్లస్టర్ బాంబులు నిర్దిష్ట లక్ష్యంపై కాకుండా విస్తారమైన ప్రాంతాల్లో పేలడం వల్ల పౌరులు బాధితులవుతారు. వీటి వాడకాన్ని అంతర్జాతీయ మానవతావాద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
మార్క్ రూబియో, పీట్ హెగ్సెత్ నివాసాలపై డ్రోన్ల కదలికలు
పశ్చిమాసియాకు వేలాదిగా బలగాలు... యూఎస్ సన్నాహాలు