ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
ABN , Publish Date - Aug 02 , 2026 | 03:57 PM
ఇండోనేషియాలోని మదురా ద్వీప సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ (ఆదివారం) సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐదుగురు మృతిచెందగా.. 41 మంది గల్లంతయ్యారు.
జకార్తా: ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ (ఆదివారం) సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐదుగురు మృతిచెందగా.. 41 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. మరికొందరిని సురక్షితంగా కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరమైన తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సర్కు వెళ్తుండగా ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఫెర్రీని ముతియారా సంతోసా-2గా అధికారులు గుర్తించారు. సహాయక చర్యల కోసం తొమ్మిది నౌకలను ఘటనాస్థలికి పంపించారు. నౌకకు నిప్పంటుకున్న వెంటనే భారీగా పొగలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంటల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు ప్రయాణికులు ఫెర్రీ నుంచి సముద్రంలోకి దూకిన దృశ్యాలు కలవరపెడుతున్నాయి. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
యువరాజ్ సింగ్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
వాషింగ్టన్లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..