తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తున్న చైనా
ABN , Publish Date - Mar 16 , 2026 | 10:24 AM
ఒక పక్క యుద్ధంలో అమెరికా బిజీగా ఉంటే చైనా.. తైవాన్ దేశ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ విమానాలను మోహరిస్తోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 26 విమానాల్ని తైవాన్ గుర్తించింది. తమ సైన్యాన్ని అప్రమత్తం చేస్తున్నట్టు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది.
తైపీ, ఫిబ్రవరి 16: తైవాన్ జలసంధిలో గత రెండు వారాలు కొనసాగిన ఆశ్చర్యకర నిశ్శబ్దానికి తెరపడింది. చైనా మళ్లీ తన సైనిక విమానాలు, నౌకలతో కవ్వింపు చర్యలకు దిగింది. గడిచిన 24 గంటల్లో తమ ద్వీపం చుట్టూ 26 చైనా సైనిక విమానాలు, 7 నౌకలు సంచరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే తమ ద్వీపం చుట్టూ 26 చైనా యుద్ధ విమానాలు గగన విహారం చేశాయని తైవాన్ రక్షణ మంత్రి వెలింగ్టన్ కూ తెలిపారు.
ఫిబ్రవరి 26 తర్వాత తైవాన్ సమీపంలో చైనా విమానాలు, నౌకల జాడ కనిపించలేదు. సాధారణంగా తైవాన్ చుట్టూ చైనాకు చెందిన విమానాలు, నౌకలు ప్రతిరోజూ తిరుగుతుంటాయి. అయితే ఫిబ్రవరి 26 నుంచి మార్చి మొదటి వారం వరకు చైనా సైనిక విమానాల కదలికలు దాదాపుగా నిలిచిపోయాయి. 2021 తర్వాత తైవాన్ కేంద్రంగా చైనా కవ్వింపు చర్యలు ఇంత ఎక్కువ కాలం పాటు ఆగడం ఇదే తొలిసారి. దీంతో చైనా తన వ్యూహాన్ని మార్చుకుందేమోనని, దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో సంయమనం పాటిస్తుండవచ్చని విశ్లేషకులు భావించారు. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ చైనా మళ్లీ తన దూకుడును ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ యుద్ధ విమానాలు, నౌకలను మోహరించడం ప్రారంభించింది.
తాజా పరిణామాల నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమైంది. తమ నుంచి విడిపోయిన భూభాగంగా తైవాన్ను పరిగణించే చైనా, అవసరమైతే బలవంతంగానైనా తిరిగి విలీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రెండు వారాల పాటు సైనిక విన్యాసాలను ఎందుకు నిలిపివేసింది, ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రారంభించింది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
ఈ వార్తలు కూడా చదవండి: