తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తోన్న చైనా
ABN , Publish Date - Mar 16 , 2026 | 10:24 AM
ఒక ప్రక్క యుద్ధంలో అమెరికా బిజీగా ఉంటే, డ్రాగన్ కంట్రీ చైనా.. తైవాన్ దేశ సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధ విమానాలను మోహరిస్తోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 26 విమానాల్ని తైవాన్ గుర్తించింది. తమ సైన్యాన్ని అప్రమత్తం చేస్తున్నట్టు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది.
తైపీ, ఫిబ్రవరి 16: గత రెండు వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం.. మళ్ళీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో భారీ సంఖ్యలో చైనా యుద్ధ విమానాలు, నౌకలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి.
కాగా, ఫిబ్రవరి 27 నుండి మార్చి 13 వరకు తైవాన్ సరిహద్దుల్లోకి చైనా యుద్ధ విమానాల రాక గణనీయంగా తగ్గింది. సాధారణంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో విమానాలను పంపే చైనా, ఈ 16 రోజుల కాలంలో కేవలం 7 విమానాలను మాత్రమే పంపింది. అయితే, ఈ ఆకస్మిక విరామానికి కారణమేంటో రక్షణ నిపుణులకు సైతం అంతుచిక్కలేదు. కానీ, ఆదివారం (మార్చి 15) నుండి చైనా మళ్ళీ తన దూకుడును పెంచింది.
తాజా వివరాలు:
తైవాన్ చుట్టూ సుమారు 26 చైనా సైనిక విమానాలను గుర్తించారు. వీటిలో 16 విమానాలు తైవాన్ నైరుతి ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ADIZ) లోకి ప్రవేశించాయి.
విమానాలతో పాటు 7 చైనా యుద్ధ నౌకలు కూడా తైవాన్ సముద్ర తీరానికి సమీపంలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 25న 30 విమానాలు వచ్చిన తర్వాత, మళ్ళీ ఈ స్థాయిలో విమానాలు రావడం ఇదే తొలిసారి.
ఇలాఉండగా, మార్చి 31న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఇక, చైనా విమానాలు లేని సమయంలో కూడా వారి యుద్ధ నౌకలు సముద్రంలోనే ఉన్నాయని తైవాన్ రక్షణ మంత్రి వెల్లింగ్టన్ కూ స్పష్టం చేశారు. చైనా నుండి ముప్పు ఏమాత్రం తగ్గలేదని.. తాము నిరంతరం అప్రమత్తంగానే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి: