బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం.. ఏడాదికి రూ.18.9 కోట్ల విలువైన పసిడి గాల్లోకి..
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:35 PM
మంచు పలకల మధ్య అగ్నిపర్వతం ఉండటమే ఒక వింత. అలాంటిది ఆ అగ్నిపర్వతం ఏకంగా బంగారం వెదజల్లుతోందంటే నమ్మగలరా? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు.. అక్షరాలా నిజం..
ప్రకృతి వైవిధ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మానవుల ఊహకందని ఎన్నో నిగూఢ రహస్యాలు ఈ ప్రకృతిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. మంచు పలకల మధ్య అగ్నిపర్వతం ఉండటమే ఒక వింత. అలాంటిది ఆ అగ్నిపర్వతం ఏకంగా బంగారం వెదజల్లుతోందంటే నమ్మగలరా? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు.. అక్షరాలా నిజం (Antarctica volcano).
సాధారణంగా అగ్నిపర్వతాలు లావా, బూడిద, విషవాయువులను వెదజల్లడం సాధారణమే. కానీ అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ (Mount Erebus) అగ్నిపర్వతం మాత్రం బంగారాన్ని కూడా గాల్లోకి వెదజల్లుతోంది. మన భూమండలానికి పూర్తిగా దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ప్రతిరోజూ సుమారు 80 గ్రాముల బంగారు ధూళిని వాతావరణంలోకి విడుదల చేస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీని విలువ రోజుకు సుమారు 6,000 డాలర్లు (దాదాపు 5.67 లక్షలు). అంటే ఏడాదికి దాదాపు 22 లక్షల డాలర్లు (రూ.18.9 కోట్లకు పైగా).
మౌంట్ ఎరెబస్ నుంచి వెలువడే బంగారం ఆవిరి రూపంలో ఉంటుంది. అగ్నిపర్వతం నుంచి సుమారు 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో బయటకు వచ్చే ఈ వేడి ఆవిరి అంటార్కిటికాలోని తీవ్రమైన చలిని తాకగానే చల్లబడి సూక్ష్మ బంగారు కణాలుగా మారిపోతుంది. ఈ కణాల పరిమాణం అత్యంత చిన్నదిగా ఉంటుంది. దీంతో అవి గాలిలో తేలుతూ దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. ఇవి చాలా సూక్ష్మ కణాలు కావడంతో వాటిని సేకరించడం లేదా వాణిజ్యపరంగా వినియోగించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు (Gold dust volcano).
భౌగోళిక దక్షిణ ధ్రువానికి సుమారు 1,350 కిలోమీటర్ల దూరంలో, రాస్ ద్వీపంలో ఉన్న ఈ ఎరెబస్ పర్వతం నుంచి బంగారు కణాలు పైకి వస్తున్నట్టు 1991లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు (Antarctica science news). అయితే బంగారం చాలా సూక్ష్మ ధూళి రూపంలో ఉండటం, అంటార్కిటికాలోని తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా దానిని సేకరించడం వీలు కాదు. అంతేకాదు, ఎరెబస్ పర్వతం అంత సూక్ష్మ బంగారు స్ఫటికాలను ఎలా సృష్టించి, విడుదల చేస్తుందో కూడా శాస్త్రవేత్తలకు ఇప్పటికీ తెలియదు.


ఇవి కూడా చదవండి..
రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..