Share News

సహారా ఎడారిలో విషాదం.. దాహంతో 49 మంది మృతి..

ABN , Publish Date - Jun 06 , 2026 | 08:46 AM

ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏడారిలో నీరు దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. సహారా ఎడారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్ చెడిపోయింది.

సహారా ఎడారిలో విషాదం.. దాహంతో 49 మంది మృతి..
Sahara Desert tragedy

ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏడారిలో నీరు దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. సహారా ఎడారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్ చెడిపోయింది. దీంతో వారు రోజుల తరబడి ఎడారిలో చిక్కుకుపోయారు. తాగునీరు లేక, తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేక 49 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు (Sahara Desert tragedy).


అధికారుల వివరాల ప్రకారం.. బాధితులంతా నైజర్‌ దేశానికి చెందినవారే. వారు పొరుగు దేశమైన మాలీలో జరిగిన ఓ మతపరమైన వేడుక నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నైజర్-మాలి-అల్జీరియా సరిహద్దులకు సమీపంలోని నిర్జన ఎడారి ప్రాంతంలో వారి ట్రక్ నిలిచిపోయింది. వాహనం చెడిపోవడంతో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు దాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. నీటి నిల్వలు పూర్తిగా అయిపోవడంతో 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య దాహంతో ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు (49 dead in desert).


ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు (Niger truck breakdown). వారు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా నడిచారు. చివరకు మంచి నీరు దొరకడంతో ప్రాణాలను దక్కించుకున్నారు. అనంతరం సమీప పట్టణానికి వెళ్లి అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రక్షక బృందాలు అక్కడికి చేరుకునే సరికి ట్రక్ కింద, చుట్టుపక్కల ప్రాంతాల్లో మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను అక్కడికక్కడే సామూహిక సమాధుల్లో ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


నార్వేలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..

Updated Date - Jun 06 , 2026 | 09:02 AM