బస్సు బోల్తా 16 మంది మృతి.. 28 మందికి గాయాలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:29 PM
ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన దహాబ్-నువేబా మధ్య ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 1: ఈజిప్టులోని తూర్పు సినాయ్ ద్వీపకల్పంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన దహాబ్ - నువేబా నగరాల మధ్య ఉన్న రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడినట్లు ఈజిప్ట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు: ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 22 మంది జోర్డాన్ దేశస్థులు ఉన్నట్లు జోర్డాన్ అధికారిక టీవీ ఛానెల్ తెలిపింది. మరణించిన 16 మందిలో కనీసం 10 మంది జోర్డాన్ పౌరులు ఉన్నట్లు సమాచారం.
రక్షణ చర్యలు: సమాచారం అందుకున్న వెంటనే ఈజిప్ట్ ఆరోగ్య శాఖ 20 అంబులెన్సులను సంఘటనా స్థలానికి తరలించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఖలీద్ అబ్దెల్ గఫార్ ఆయా ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి (హై అలర్ట్) ప్రకటించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, బస్సు బోల్తా పడటానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, దీనిపై ఈజిప్ట్ పోలీసులు విచారణ జరుపుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..