Share News

NCERT వివాదం.. ముగ్గురు నిపుణులపై గతంలో ఇచ్చిన ప్రతికూల ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 22 , 2026 | 02:39 PM

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల వివాదంలో ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. గతంలో వారిపై విధించిన నిషేధాన్ని, ప్రతికూల ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సవరించింది.

NCERT వివాదం.. ముగ్గురు నిపుణులపై గతంలో ఇచ్చిన ప్రతికూల ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు
Supreme Court Withdraws Ban on 3 Experts in Delhi NCERT Textbook Controversy

న్యూఢిల్లీ, మే 22: ఎన్‌సీఈఆర్‌టీ 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్' (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తక వివాదంలో ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రొఫెసర్ మిచెల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లను ప్రభుత్వ విద్యాసంబంధిత కార్యకలాపాల నుంచి దూరంగా పెట్టాలంటూ (బ్లాక్‌లిస్ట్) గతంలో ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ శుక్రవారం ఉపసంహరించుకుంది.

చీఫ్ జస్టిస్ (CJI) సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం మార్చి 11 నాటి తమ పాత ఉత్తర్వులను సవరిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

'బ్లాక్‌లిస్ట్' ఆదేశాల సవరణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఈ ముగ్గురు నిపుణులను ఏ బాధ్యతల్లోనూ తీసుకోకూడదని, వారిని దూరం పెట్టాలని మార్చిలో కోర్టు ఆదేశించింది. అయితే, తాజాగా నిపుణుల తరపు న్యాయవాదులు సమర్పించిన వివరణను పరిగణనలోకి తీసుకున్న బెంచ్, ఆ ఆదేశాలను రద్దు చేసింది. భవిష్యత్తులో వీరి సేవలను ఉపయోగించుకునే అంశాన్ని ప్రభుత్వాల సంబంధిత అధికార వర్గాల స్వతంత్ర నిర్ణయానికే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే, వీరు కావాలనే లేదా తెలిసి తప్పుడు సమాచారాన్ని పుస్తకంలో చేర్చారన్న పాత వ్యాఖ్యలను కూడా కోర్టు రికార్డుల నుండి తొలగించింది.

వివాదం నేపథ్యం ఏమిటి?

ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం (Exploring Society: India and Beyond - Vol. 2) లోని 'న్యాయవ్యవస్థ పాత్ర' అనే అధ్యాయంలో... న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక విభాగాన్ని చేర్చారు. దీనిపై ఫిబ్రవరిలో మీడియాలో కథనాలు రావడంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఆ కంటెంట్ న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా ఉందంటూ కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు చెప్పి ఆ పుస్తకాల పంపిణీని నిలిపివేసింది.

The-Bar-Bench.jpg


కోర్టు ఆందోళన: సమతుల్యత లోపించింది

నిపుణులపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ, సదరు చాప్టర్ కంటెంట్ పూర్తిగా 'అవాంఛనీయం, అనవసరం' అని కోర్టు పునరుద్ఘాటించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ:

'న్యాయవ్యవస్థలోని సవాళ్లను చూపించడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ అందులో సమతుల్యత (Balance) లోపించింది. రాజ్యాంగ ఉనికి, న్యాయవ్యవస్థ ప్రాముఖ్యత, సామాన్యుడికి న్యాయం అందడం (Access to Justice), ఉచిత న్యాయ సహాయం వంటి సానుకూల అంశాల గురించి ఒక్క ముక్కా రాయకుండా, కేవలం అవినీతిని మాత్రమే హైలైట్ చేయడం సరికాదు.' అని వ్యాఖ్యానించారు.

జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీ పరిశీలన

ప్రస్తుతం ఆ వివాదాస్పద భాగాన్ని తొలగించిన కేంద్ర ప్రభుత్వం, కొత్త పాఠ్యాంశాల రూపకల్పన కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్, హెచ్‌ఎన్‌బీ గర్హ్వాల్ వర్సిటీ వీసీ ప్రకాష్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.

ఇదే సమయంలో, 11వ తరగతి పాఠ్యపుస్తకాల్లోనూ విద్యార్థుల మనసులపై ప్రతికూల ప్రభావం చూపే కొన్ని కార్టూన్లు ఉన్నాయని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకురాగా.. వాటిని కూడా పరిశీలించాలని జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.


Also Read:

వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి

తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం? జగన్ తీరుపై మంత్రి గొట్టిపాటి ధ్వజం

Updated Date - May 22 , 2026 | 02:59 PM