Share News

సంకల్పం మంచిదే... అమలే సవాలు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:23 AM

ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను హేతుబద్ధీకరించి, తక్కువ విద్యార్థులున్న వేలాది పాఠశాలల స్థానంలో సమగ్ర ‘క్లస్టర్ పాఠశాలలు’ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన విద్యావేత్తలు, తల్లిదండ్రులు...

సంకల్పం మంచిదే... అమలే సవాలు!

ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను హేతుబద్ధీకరించి, తక్కువ విద్యార్థులున్న వేలాది పాఠశాలల స్థానంలో సమగ్ర ‘క్లస్టర్ పాఠశాలలు’ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల మధ్య విస్తృత చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పం ప్రశంసనీయం.

ప్రస్తుతం అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించడం సాధ్యం కావడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. కేవలం కొద్దిమంది విద్యార్థుల కోసం వేలాది పాఠశాలలను నిర్వహించడం ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం కాదని వాదిస్తోంది. అందువల్ల వాటిని విలీనం చేసి, నర్సరీ నుంచి ఇంటర్ వరకు బోధన, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ విద్యా వనరులు, క్రీడా సదుపాయాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఉచిత రవాణా వంటి సౌకర్యాలతో కూడిన క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

విద్యాపరంగా చూస్తే ఈ ప్రతిపాదనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పెద్ద పాఠశాలల్లో గణితం, విజ్ఞానం, ఆంగ్లం, సామాజికశాస్త్రం వంటి ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు పరస్పర పోటీ, సమూహ అధ్యయనం, క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రభుత్వ నిధులను విభజించి చిన్న చిన్న పాఠశాలలపై ఖర్చు చేయడం కంటే, కొద్ది పాఠశాలలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అయితే ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల అందుబాటు అత్యంత కీలకం. ప్రస్తుతం అనేక మంది పిల్లలు తమ గ్రామంలోనే లేదా నడిచి వెళ్లగలిగే దూరంలో ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పాఠశాలలను విలీనం చేస్తే, వారు ప్రతిరోజూ అనేక కిలోమీటర్లు ప్రయాణించి క్లస్టర్ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది పెద్ద భారం. ప్రభుత్వం ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. అయితే సమగ్ర ప్రణాళిక, తగిన నిధుల కేటాయింపు, సమర్థవంతమైన పరిపాలనపై దాని విజయం ఆధారపడి ఉంటుంది. బస్సుల కొరత, రోడ్ల సమస్యలు లేదా నిర్వహణలో లోపాలు ఏర్పడితే పిల్లల హాజరు ప్రభావితమవుతుంది. ఆరు లేదా ఏడు సంవత్సరాల వయస్సు గల పిల్లలు ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే అలసిపోతారు. చదువుకు తక్కువ సమయం,


ఆటపాటల కొరత వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిన్న పిల్లలను దూర ప్రాంతాలకు పంపడానికి తల్లిదండ్రులు కూడా సంకోచించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో యుక్తవయసు బాలికలు ఎక్కువ దూరం ప్రయాణించడం పట్ల అనేక కుటుంబాల్లో ఇప్పటికీ ఆందోళనలున్నాయి. భద్రత, రవాణా, సమయపాలన వంటి అంశాల కారణంగా వారు చదువును మధ్యలోనే నిలిపివేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పేద, అట్టడుగు వర్గాల పిల్లలపై ఇది ప్రభావం చూపుతుంది. పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయుల బదిలీలు పెరగడం, గ్రామాలతో ఏర్పడిన అనుబంధం దెబ్బతినడం, పెద్ద పాఠశాలల్లో పని భారం అధికమయ్యే అవకాశం ఉంటుంది.

తగిన ఆర్థిక వనరులు కేటాయించకుండా, రవాణా వ్యవస్థను బలోపేతం చేయకుండా, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా పాఠశాలల విలీనాన్ని తొందరపడి అమలు చేస్తే గ్రామీణ పిల్లలకు ప్రతికూల ప్రభావం కలుగుతుంది. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఇది విద్యాభ్యాసంలో పెద్ద ఆటంకం. ప్రతి గ్రామానికి సమీపంలో ప్రాథమిక పాఠశాలలు కొనసాగిస్తూ, ఉన్నత తరగతుల కోసం మాత్రమే క్లస్టర్ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం. దీని అమలుకు ముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలి. అమలు అనంతరం విద్యార్థుల నమోదు, హాజరు, చదువు మానివేత శాతం వంటి అంశాలను నిరంతరం పరిశీలించి అవసరమైన మార్పులు చేయాలి.

విద్యా సంస్కరణల లక్ష్యం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ప్రతి చిన్నారికీ విద్య అందుబాటులో ఉండేలా చూడడం కావాలి. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం ప్రశంసనీయం. అయితే ఈ క్రమంలో ఏ ఒక్క చిన్నారి కూడా దూరం, రవాణా లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరం కాకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత. మెరుగైన భవనాలు నిర్మించడం కంటే ప్రతి చిన్నారికి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడమే ఈ సంస్కరణ విజయానికి కొలమానం కావాలి.

యార్లగడ్డ శ్రీధర్‌రావు

విశ్రాంత ఉపాధ్యాయుడు

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 12:23 AM