Share News

మణిగుహ్: గ్రంథాలయ గ్రామం

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:31 AM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న చిన్న కొండ గ్రామం మణిగుహ్. హిమాలయాల అద్భుత దృశ్యాల మధ్య ఉన్న ఈ గ్రామం ఇప్పుడొక ప్రత్యేక...

మణిగుహ్: గ్రంథాలయ గ్రామం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న చిన్న కొండ గ్రామం మణిగుహ్. హిమాలయాల అద్భుత దృశ్యాల మధ్య ఉన్న ఈ గ్రామం ఇప్పుడొక ప్రత్యేక గుర్తింపును సాధించింది. 20,000కు పైగా పుస్తకాలు, ఎనిమిది పఠన కేంద్రాలు, చదవడాన్ని దైనందిన జీవితంలో భాగంగా మార్చుకున్న సముదాయం కారణంగా ఇది ‘గ్రంథాలయ గ్రామం’గా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి అందాల మధ్య జ్ఞానానికి నిలయంగా మారిన ఈ గ్రామం, ఆధునిక భారత గ్రామీణాభివృద్ధికి ఒక కొత్త నమూనాను చూపిస్తోంది.

ఈ గ్రామం నుంచి చౌఖంబా, సతోపంథ్, తలయ్‌సాగర్ వంటి హిమాలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడి పిల్లలు కొండ మార్గాల్లో నడుస్తూనే పుస్తకాల్లో మునిగిపోవడం, సాంకేతిక స్క్రీన్లకు సమానంగా పుస్తకాలను తమ జీవితంలో భాగం చేసుకోవడం ఒక సాధారణ దృశ్యం. చదవడం ఇక్కడ రోజువారీ జీవనశైలిగా మారింది. మణిగుహ్– ‘గ్రంథాలయ గ్రామం’గా పరివర్తన చెందడం వెనుక ‘హమారా గావ్ ఘర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ దీర్ఘకాలిక కృషి ఉంది. గ్రామంలో చదవడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, ప్రజలను పుస్తకాలతో అనుసంధానించడం, విద్యను గ్రామ జీవనంలో భాగంగా మార్చడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. వారి ప్రయత్నాల ఫలితంగా గ్రామం.. ఒక సాధారణ నివాస ప్రాంతం నుంచి జ్ఞాన కేంద్రంగా మారింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా ఉన్నది మణిగుహ్ సెంట్రల్ లైబ్రరీ, స్థానికంగా దీనిని ‘పుస్తక తీర్థం’గా పిలుస్తారు. ఇక్కడ హిందీ, ఆంగ్లం, ఉర్దూ, సంస్కృతం, కశ్మీరీ, పంజాబీ వంటి అనేక భాషల్లో ఇరవై వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సైన్స్, చరిత్ర, సాహిత్యం, పోటీ పరీక్షల సన్నద్ధత, పిల్లల కథలు వంటి విభిన్న అంశాల పుస్తకాలు ఇందులో ఉన్నాయి. 19వ శతాబ్దానికి చెందిన అరుదైన ముద్రణలు కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి. ఈ గ్రంథాలయానికి ప్రవేశం పూర్తిగా ఉచితం. గ్రంథాలయ గ్రామ నమూనా మరో ముఖ్య లక్షణం... చదవడాన్ని ఒకే భవనానికి పరిమితం చేయకపోవడం. గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రతాప్‌నగర్, ఖమోలి, బందీ, ఖల్యూ వంటి ప్రాంతాల్లో ఎనిమిది చిన్న పఠన కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ‘పుస్తక మందిర్’లుగా పిలుస్తారు. ఇవి ప్రజలు సహజంగా కూడే ప్రదేశాల్లో– దారులు, దేవాలయాలు, గ్రామ చౌరస్తాలు– నిర్మించారు.


మణిగుహ్ అభివృద్ధి నమూనా కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది జీవనోపాధి, పర్యావరణం, సామాజిక అభివృద్ధిని కూడా కలిపిన సమగ్ర విధానాన్ని అనుసరిస్తోంది. గ్రామ మహిళలు పైన్ సూదులతో (పైరుల్) చేతిపని ఉత్పత్తులు తయారు చేస్తారు. సాధారణంగా అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే పైన్ సూదులను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడం ద్వారా, పర్యావరణ సమస్యను ఆర్థిక అవకాశంగా మార్చారు. ఈ ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం గ్రామ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తోంది. అదేవిధంగా తేనెటీగల పెంపకం (అపి కల్చర్) శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవి గ్రామస్థులకు స్థిరమైన ఆదాయ వనరులను అందించడమే కాకుండా, ప్రకృతితో సమన్వయంగా జీవించాలనే భావనను పెంపొందిస్తున్నాయి. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి ఒక కొత్త మార్గం రూపొందించారు.

ప్రతి సంవత్సరం నిర్వహించే ‘గావ్–ఘర్ మహోత్సవ్’ ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సాంస్కృతిక ఉత్సవంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రొఫెసర్లు, రచయితలు, కళాకారులు, కవులు పాల్గొంటారు. గ్రామ ప్రజలతో కలిసి వారు జ్ఞాన, సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం అవుతారు. ‘బుక్ మారథాన్’ అనే కార్యక్రమం ద్వారా చదవడాన్ని సామూహిక ఉద్యమంగా మార్చారు. అన్ని వయసుల ప్రజలు ఇందులో పాల్గొని పుస్తకాలను చదవడం, చర్చించడం ద్వారా అక్షరాస్యతను సామాజిక అనుభవంగా మారుస్తున్నారు. ఈ ప్రయత్నాలు గ్రామాన్ని కేవలం నివాస ప్రాంతంగా కాకుండా, ఒక ఆలోచనా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం యువత నగరాలకు వలస వెడుతున్న పరిస్థితిని తగ్గించడానికి మణిగుహ్ గ్రామంలో విద్య, జీవనోపాధి, సాంస్కృతిక అభివృద్ధి వంటివాటిని ఒకే వేదికపై తీసుకువచ్చారు. ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీ వంటి సంస్థలు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చదువు మధ్యలో ఆగిపోయిన మహిళలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా గ్రామాభివృద్ధికి మరింత బలం చేకూరుస్తున్నారు.

మొత్తానికి, మణిగుహ్ గ్రామం చూపిస్తున్నది ఒక స్పష్టమైన సందేశం– ‘పుస్తకాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, జీవితాన్ని మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. ఒక్కో పేజీని తిరగేయడం ద్వారా ఒక సమాజం తన భవిష్యత్తును తిరిగి రాసుకోవచ్చు’ అని.

రవికుమార్ చేగోని

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం

ఈ వార్తలు కూడా చదవండి..

చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్

నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 01:31 AM