సిప్.. సరికొత్త రికార్డు
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:08 AM
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి ఈ ఆగస్టులో నికరంగా రూ.29,329 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగు నెలల గరిష్ఠ స్థాయి. అంతేకాదు, ఈ జూలైలో నమోదైన రూ.24,697 కోట్ల...
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి ఈ ఆగస్టులో నికరంగా రూ.29,329 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగు నెలల గరిష్ఠ స్థాయి. అంతేకాదు, ఈ జూలైలో నమోదైన రూ.24,697 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 19 శాతం ఎక్కువలని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) గురువారం వెల్లడించింది. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలకు లోనవుతున్నప్పటికీ, మదుపరులు మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులను కొనసాగించడం ఇందుకు దోహదపడిందని యాంఫీ పేర్కొంది. అలాగే, క్రమానుగుత పెట్టుబడి పథకాల (సిప్) ద్వారా రిటైల్ మదుపరుల నెలవారీ పెట్టుబడులు సరికొత్త రికార్డు స్థాయి రూ.32,297 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) మొత్తం సిప్ పెట్టుబడులు రూ.1.6 లక్షల కోట్లకు చేరాయి.
మూడు రోజుల తర్వాత లాభాల్లోకి
వరుసగా మూడు రోజులు నష్టాల్లో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్.. చివరి నిమిషంలో ఎంపిక చేసిన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లతో 138.36 పాయింట్ల వృద్ధితో 74,902.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 46.30 పాయింట్లు పెరిగి 23,477.80 వద్ద స్థిరపడింది. కాగా డాలర్తో రూపాయి మారకం విలువ మరో 44 పైసలు క్షీణించి రూ.95.52 వద్ద ముగిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ