పెరిగిన భారతీయుల 'ఇంటి భోజనం' ఖర్చు!
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:53 PM
ఇంట్లో వండుకునే వంట ఖర్చు గత నెలలో మోస్తరుగా పెరిగినట్లు ప్రముఖ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. తన 'రోటీ రైస్ రేట్' నివేదికలో అనేక విషయాలు వెల్లడించింది.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 8: గత (ఆగస్టు) నెలలో ఇంట్లో వండుకునే భోజనం ఖర్చు మోస్తరుగా పెరిగినట్లు ప్రముఖ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ ఇంటెలిజెన్స్ (CRISIL Intelligence) తన 'రోటీ రైస్ రేట్' నివేదికలో వెల్లడించింది. టమోటా, బంగాళాదుంపల ధరలు తగ్గినప్పటికీ.. ఉల్లిపాయలు, వంట నూనెలు, ఎల్పీజీ గ్యాస్, బియ్యం ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.
శాకాహార భోజనం: ఆగస్టులో ఒక శాకాహార భోజనం సగటు ఖర్చు రూ. 29.5గా నమోదైంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే, అలాగే జులై నెలతో పోలిస్తే ఈ ధర 1 శాతం పెరిగింది.
మాంసాహార భోజనం: గతేడాదితో పోలిస్తే నాన్-వెజ్ థాలి ఖర్చు 5 శాతం పెరిగి రూ. 57.5కు చేరింది. చికెన్ (బ్రాయిలర్) ధరలు ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరగడం ఇందుకు కారణం. అయితే, శ్రావణ మాసం కారణంగా బ్రాయిలర్ కోళ్ల వినియోగం తగ్గి, వాటి ధరలు 4 శాతం తగ్గడంతో జులై నెలతో (రూ. 58.3) పోలిస్తే ఆగస్టులో నాన్-వెజ్ థాలి ఖర్చు 1 శాతం తగ్గింది.
ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు
మండిపోతున్న ఉల్లి: గతేడాది ఆగస్టులో కిలో ఉల్లిపాయల సగటు ధర రూ. 28 ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 43 శాతం పెరిగి రూ. 40కి చేరింది. మార్చి-ఏప్రిల్ నెలల్లో మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల పంట దెబ్బతిని సరఫరా తగ్గడమే ఇందుకు కారణం. జులైతో పోలిస్తే ఒక్క ఆగస్టులోనే ఉల్లి ధరలు 17 శాతం పెరిగాయి.
పెరిగిన ఇతర నిత్యావసరాలు: ఏడాది ప్రాతిపదికన వంట నూనెల ధరలు 11 శాతం, ఎల్పీజీ సిలిండర్ ధరలు 10 శాతం పెరిగాయి.
కలిసొచ్చిన టమోటా, బంగాళాదుంప: టమోటా ధరలు ఏడాది ప్రాతిపదికన 28 శాతం (నెలవారీగా 7 శాతం), బంగాళాదుంపల ధరలు 12 శాతం తగ్గడం వల్ల భోజన ఖర్చు మరింత పెరగకుండా అదుపులో ఉంది.
ఇవి కూడా చదవండి:
గిల్పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్