బంగారంపై మరిన్ని ఆంక్షలు?
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:29 AM
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం వాణిజ్యంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి..
పసిడి దిగుమతి బ్యాంకుల నుంచి సమగ్ర సమాచారం కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం వాణిజ్యంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గోల్డ్ మెటల్ లోన్స్ (బంగారు లోహ రుణం), బంగారంపై రుణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సమర్పించాలని బులియన్ దిగుమతి బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరడమే ఇందుకు సంకేతం. 2023 నుంచి ఇప్పటివరకు బంగారు లోహ రుణం విలువ, పరిమాణంతో పాటు కస్టమర్లు, అంతర్జాతీయ పసిడి సరఫరాదారులు, పోర్ట్ఫోలియో సైజ్, తనఖా సొమ్ము, రుణగ్రహీత సంఖ్య వంటి వివరాలను సోమవారం నాటికి సమర్పించాల్సిందిగా బ్యాంకులను ఆర్థిక సేవల డిపార్ట్మెంట్ కోరినట్లు తెలిసింది. ఈ ఏడాది మే 13న కేంద్రం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. అంతకు మూడు రోజుల ముందు ప్రధాని మోదీ.. ఏడాది వరకు ప్రజలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
పసిడి దిగుమతికి 15 బ్యాంకులకు అనుమతి
ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ సహా 15 ప్రధాన బ్యాంకులు ప్రస్తుతం దేశంలోకి పసిడి దిగుమతి చేసుకునేందుకు ఆర్బీఐ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) అనుమతి కలిగి ఉన్నాయి. ఇవి జేపీ మోర్గాన్, స్టాండర్ట్ చార్టర్డ్ వంటి అంతర్జాతీయ రుణదాతల నుంచి బంగారాన్ని అరువు తీసుకుని దేశంలోని ఆభరణ వర్తకులకు గోల్డ్ మెటల్ లోన్స్ రూపంలో అందజేస్తుంటాయి. లేదా కన్సైన్మెంట్ అరేంజ్మెంట్ ద్వారా పూర్తి చెల్లింపులు జరిపి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి బంగారాన్ని సమీకరిస్తాయి. ఈ విషయంలో దేశీయ టోకు కొనుగోలుదారుల నుంచి లభించే ఆర్డర్లను బట్టి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి.
2025-26లో 24 శాతం పెరిగిన బంగారం దిగుమతి వ్యయం
2024-25తో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు 721 టన్నులకు తగ్గినప్పటికీ, బంగారం దిగుమతి వ్యయం మాత్రం 24 శాతం పెరిగి 7,190 కోట్ల డాలర్లకు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News