Share News

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ నూతన సీఈఓగా ఆశా శర్మ

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:02 PM

మైక్రోసాఫ్ట్ విభాగంలో భారత సంతతి వ్యక్తి ఆశా శర్మకు ఉన్నత పదవి దక్కింది. గేమింగ్ విభాగంలో ఈ టెకీని నూతన సీఈఓగా నియమిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ నూతన సీఈఓగా ఆశా శర్మ
Asha Sharma

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ విభాగానికి నూతన సీఈఓగా భారత సంతతి వ్యక్తి ఆశా శర్మ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఫిల్‌ స్పెన్సర్‌ పదవీ విరమణ చేయడంతో తదుపరి సీఈఓగా ఆశా శర్మకు ఈ బాధ్యతలు అప్పగించింది సంస్థ. ఈ టెకీ గేమింగ్‌ డివిజన్‌కు సీఈఓగా, వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించనున్నారు.


అయితే.. ఆశా శర్మ ఎదుట పెద్ద సవాళ్లు ఉన్నాయని పలువురు టెకీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఆదాయ వృద్ధి మందగించడం సహా గేమింగ్ కంటెంట్ కోసం ప్రపంచ మార్కెట్లలో మైక్రోసాఫ్ట్ తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం వంటి ఛాలెంజ్‌లు కొత్త సీఈఓ ముందున్నాయి.


అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో కార్ల్‌సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేశారు ఆశా శర్మ. ఆ తర్వాత కెరీర్‌ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌ మార్కెటింగ్‌ విభాగంలో పనిచేశారు. 2013లో మైక్రోసాఫ్ట్ సంస్థను వీడిన ఆశా శర్మ.. పలు అంతర్జాతీయ టెక్ కంపెనీల్లో ఉన్నత స్థాయి హోదాల్లో పనిచేశారు. అనంతరం రెండేళ్ల క్రితం మరలా మైక్రోసాఫ్ట్ గూటికి చేరారు. అక్కడ కృత్రిమ మేథ విభాగంలో సీనియర్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఇలా కోర్ ఏఐ విభాగంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగానే ఇప్పుడు సీఈఓ పదవి వరించింది. ఆశా శర్మతో పాటు ఇతర సీనియర్‌ అధికారుల స్థానాల్లోనూ పలు మార్పులు చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.


ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 21 , 2026 | 05:05 PM