గొడ్డలి పార్టీని ఆదరించడమంటే విషపామును పెంచి పోషించడమే: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:09 PM
అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తూ చలామణి అవుతున్న గొడ్డలి పార్టీని రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మహిళలను అవహేళనగా కించపరుస్తున్న గొడ్డలి పార్టీ నాయకులను వారే నిలదీయాలని స్పష్టం చేశారు.
పాలకొల్లు, సెప్టెంబర్ 20: అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తూ చలామణి అవుతున్న గొడ్డలి పార్టీని రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మహిళలను అవహేళనగా కించపరుస్తున్న గొడ్డలి పార్టీ నాయకులను వారే నిలదీయాలని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీని ఆదరించడమంటే.. విషపామును పెంచి పోషించడమేనని మండిపడ్డారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. పాలకొల్లు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కష్టపడి నిధులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
గొడ్డలి పార్టీ పాలనలో పాలకొల్లు నియోజకవర్గం ఒక్క రూపాయి అభివృద్ధికి కూడా నోచుకోలేదని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేలా రూ. 200 కోట్ల నిధులు తీసుకు వచ్చి పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ ఆ పనిని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాల మంచినీటి పథకాన్ని పునరుద్ధరించి పనులు చేపట్టామని గుర్తు చేశారు.
టిడ్కో గృహాలను లబ్ధిదారుల పేరుతో తాకట్టి పెట్టి, పాలకొల్లులోనే రూ.160 కోట్ల నిధులను దారి మళ్ళించింది నాటి గొడ్డలి పార్టీ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ళను, మరో రెండు నెలల్లోగా లబ్దిదారులకు అప్పగించేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.