గొల్లగుప్పలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలి: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Sep 02 , 2026 | 08:06 AM
గొల్లగుప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 02: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మల్లేరియా నివారణకు వినియోగించే క్లోరోక్వీన్ మాత్రలు వికటించి.. బాలిక మృతి చెందింది. అలాగే పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతోపాటు పోలవరం జిల్లా ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు.
52 మందికి మలేరియా ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ అని తేలిందని మంత్రికి అధికారులు వివరించారు. వీరికి యాంటీ మలేరియా చికిత్స ప్రారంభించామని తెలిపారు. పోలవరం జిల్లా గౌరీదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గొల్లగుప్ప గ్రామానికి చెందిన 47 మంది చిన్నారులతో కలిపి 52 మంది భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రికి వారు చెప్పారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రికి అధికారులు చెప్పారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఏరియా ఆసుపత్రి తరలించామని పేర్కొన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిని ఆర్ఆర్టీ, ఆర్ఎంసీ కాకినాడ, జీఎంసీ రాజమండ్రి బృందాలు సందర్శించాయని తెలిపారు. రాష్ట్ర అదనపు డైరెక్టర్ (డీసీపీ), జాయింట్ డైరెక్టర్ అర్జునరావు (సీడీపీ) పర్యవేక్షణలో వైద్య సేవలు కొనసాగుతున్నాయని మంత్రి సత్యకుమార్కు అధికారులు వివరించారు.
ఈ వార్తలు చదవండి..
ఆ చేపలను తినకండి.. బిహార్ ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక
హైదరాబాద్ భారీగా అల్ప్రాజోలం పట్టివేత.. ఐదుగురి అరెస్ట్