ఏపీ అభివృద్ధికి ఐఐటియన్ల బాసట
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:06 AM
రాష్ట్రంలో డీప్టెక్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి, పరిశోధన, ఆవిష్కరణ, పెట్టుబడుల ఆకర్షణ కు దేశంలోని ఐఐటీల పూర్వ విద్యార్థులు బాసటగా నిలువనున్నారు. విద్యావేత్తలను, పారిశ్రామిక దిగ్గజా లను ఒకే వేదికపై తీసుకొచ్చే లక్ష్యంతో పాన్ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సు-2026 నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. పాన్ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో అక్టోబరు 3న విజయవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కన్వెన్షన్ సెంటర్లో సదస్సును నిర్వహించనున్నారు.
అక్టోబరు 3న పాన్ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్-2026
విజయవాడ వేదికగా నిర్వహణ
పాన్ఐఐటీ అలుమ్ని ఆధ్వర్యంలో సదస్సు
పాల్గొననున్న టెక్, ఇండస్ట్రీ ప్రముఖులు
రాష్ట్రంలో డీప్టెక్ ఎకోసిస్టం అభివృద్ధి లక్ష్యం
సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీప్టెక్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి, పరిశోధన, ఆవిష్కరణ, పెట్టుబడుల ఆకర్షణ కు దేశంలోని ఐఐటీల పూర్వ విద్యార్థులు బాసటగా నిలువనున్నారు. విద్యావేత్తలను, పారిశ్రామిక దిగ్గజా లను ఒకే వేదికపై తీసుకొచ్చే లక్ష్యంతో పాన్ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సు-2026 నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. పాన్ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో అక్టోబరు 3న విజయవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కన్వెన్షన్ సెంటర్లో సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజర వుతారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సదస్సులో పాల్గొంటారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్టెక్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ తదితర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా ఈ సదస్సును ‘‘ ఇ-స్వర్ణాంధ్ర నుంచి వికసిత్ భారత్ - 2047’’ పేరిట నిర్వహి స్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ శనివారం పేర్కొంది. ఈ సదస్సుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో పాటు మరికొందరు గ్లోబల్ టెక్నాలజీ నిష్ణాతులు హాజరుకానున్నారు. అలాగే దేశంలోని వివిధ ఐఐటీల డైరెక్టర్లు, అధ్యాపకులు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు, టెక్నాలజీ నిపుణులు సదస్సులో పాల్గ్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన, అంతర్జాతీయ స్థాయి డీప్టెక్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ నిర్మాణంపై ఈ సమ్మిట్లో చర్చిస్తారు. సాంకేతికత ఆధారిత కొత్త పరిశ్రమలు, పరిశోధన, పెట్టుబడులు, స్టార్టప్లు, నైపుణ్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను గుర్తించడంతో పాటు, రాష్ట్ర యువతకు కొత్త ఉపాధి, పారిశ్రామిక అవకాశాలను కల్పించే మార్గాలపై కూడా సదస్సు దృష్టి సారించనుంది.
ప్రభుత్వం, పరిశ్రమ రంగాల ప్రముఖుల భాగస్వామ్యం
సదస్సులో జాతీయ ఆరోగ్య ప్రాధికా ర సంస్థ సీఈవో సునీల్ కుమార్ బర్న్వాల్, ఏపీ సీఎస్ సాయి ప్రసాద్, ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్స్ ఇండియా సీఈవో హితేష్ గార్గ్, ఐఐటీ మద్రాస్ ఏఐ అధిపతి రవీంద్రన్, ఐబీఎం ఇండియా అండ్ సౌత్ ఏసియా, ఆసియా ఫసిఫిక్ సీటీఓ అమిత్ సింఘీ, ఎల్ ఆండ్ టిఏరో స్పేస్ అధిపతి అరుణ్ రామ్ చందానీ, హనీవెల్ ఏరో స్పేస్ ఇండియా ఎండీ యారం విజయ్ కుమార్, సీఎస్ఐఆర్- సీఎఫ్టీఆర్ ఐఎస్ కు చెందిన డా. గిరిధర్ పార్వతం, ఎస్ఎల్ బీ ఇండియా రీజియన్ ఎండీ లలిత్ అగర్వాల్ తదితరులు పాల్గొననున్నారు.
23 ఐఐటీల ప్రతిభ ఏపీకి
ప్రభుత్వం, పరిశ్రమలు, దేశంలోని అన్ని 23 ఐఐటీలకు చెందిన ప్రతిభ, సాంకేతికత, పెట్టుబడులు, నైపుణ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ డీప్టెక్ దశాబ్దానికి పునాది వేయడమే సమ్మిట్ లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 విజన్ను పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడులు, యువతకు అవకాశాల రూపంలో కార్యరూపంలోకి తీసుకు వచ్చే ఉద్దేశంలో ఈ సదస్సు ఏర్పాటవుతోంది.
- స్వదీప్ పిళ్లరిశెట్టి,
పాన్ఐఐటీ ఏపీ సమ్మిట్ - 2026 చైర్మన్
ఒకే వేదికపైకి దిగ్గజాలు
ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సదస్సు ప్రత్యేకత. ఏఐ, డీప్టెక్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకుని రాష్ట్రాన్ని ప్రముఖ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చేయవచ్చు.
- పాన్ఐఐటీ అలుమ్ని ఇండియా చైర్మన్
- ప్రభాత్ కుమార్
ఇదీ పాన్ఐఐటీ అలుమ్ని ఇండియా
పాన్ఐఐటీ అలుమ్ని ఇండియా (పీఐఏఐ) దేశంలోని మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించే ఒక స్వచ్ఛంద సంస్థ. 2006లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన పాన్ ఐఐటీ.. ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యా వేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రా మికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర ్తలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీ సుకువస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, విధాన చర్చలు, టెక్నాలజీ - ఇన్నోవేషన్ కార్యక్రమాలు, సామాజిక ప్ర భావ కార్యక్రమాల ద్వారా ఐఐటీ అలుమ్ని సమాజం యొక్క నైపుణ్యం, అనుభవం, ప్రపంచవ్యాప్త నెట్వర్క్ను దేశ అభివృద్ధి, సాంకేతిక ప్రగతి, ప్రపంచ స్థాయి నాయకత్వం కోసం వినియోగిం చడమే పాన్ఐఐటీ లక్ష్యం. ప్రపంచ టెక్నాలజీ రంగం ప్రముఖులు సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, ఎన్.ఆర్. నారాయణ మూర్తి, వినోద్ ఖోస్లా, రఘురామ్ రాజన్ తదితరులు ఐఐటీ అలుమ్ని విస్తరణలో కీలకపాత్రను పోషిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి