రూ.15 లక్షల లంచం తీసుకుంటూ.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:52 PM
విజయవాడలో సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. రూ.179.50 కోట్ల రైల్వే ప్రాజెక్ట్లో రూ.7 కోట్ల బోనస్ మంజూరుకు సహకరించేందుకు రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు..
విజయవాడ, ఆగస్టు 16: నగరంలో సీబీఐ అధికారులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్లో రూ.15 లక్షల లంచం తీసుకుంటూ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల ప్రాజెక్టులో ముందస్తుగా పనులు పూర్తి చేసినందుకు రూ.7 కోట్ల బోనస్ క్లెయిమ్ చేసిన జాయింట్ వెంచర్ సంస్థకు బోనస్ మంజూరు, విడుదల విషయంలో సహకరించేందుకు రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోనస్ మంజూరుకు అనుకూలంగా ఫైల్ తేదీలను మార్చినట్లు కూడా సీబీఐ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
గణపతి ఇంజినీరింగ్ వర్క్స్, యెల్లా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్కు సంబంధించిన వ్యవహారంలో ప్రైవేట్ కంపెనీ ఎండీ కుమారుడి ద్వారా లంచం చెల్లించినట్లు సీబీఐ వెల్లడించింది. విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చి లంచం అందజేస్తుండగా రూ.15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్లోని నిందితుల ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను ఆగస్టు 17న విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నట్లు సీబీఐ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..
ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు