పొగాకు పంట ఉత్పత్తి పరిమాణం తగ్గింపు
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:33 AM
రాష్ట్రంలో 2026-27 మార్కెట్ సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. 2025-26 ఏడాదిలో 142 మిలియన్ కిలోలకు అనుమతించగా, 2026-27లో దానిని 81 మిలియన్ కిలోలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
వచ్చే ఏడు మార్కెట్ డిమాండ్కు తగ్గట్లు నియంత్రణ కోసమే
ప్రకటించిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2026-27 మార్కెట్ సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. 2025-26 ఏడాదిలో 142 మిలియన్ కిలోలకు అనుమతించగా, 2026-27లో దానిని 81 మిలియన్ కిలోలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్లో మిగులు ఉత్పత్తి సమస్య తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది అనుమతించిన పరిమాణంలోనే పంట ఉత్పత్తి చేసేలా పొగాకు బోర్డు ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్లో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అంచనా వేయగా, 236 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయ్యిందని అచ్చెన్న తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోలు మార్కెట్ అయ్యిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కిలో పొగాకుకు సగటు ధర రూ.209.83గా నమోదైందని చెప్పారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో కిలోకి రూ.329, ఎస్ఎల్ఎస్ ప్రాంతంలో రూ.255, ఎస్బీఎస్ ప్రాంతంలో రూ.252 గరిష్ఠ ధర పలికిందని వివరించారు. వేలం కేంద్రాల్లో నో బిడ్ బేల్స్ శాతం గణనీయంగా తగ్గిందని, దీనివల్ల వారానికి 10 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ అవుతోందని మంత్రి అచ్చెన్న తెలిపారు.
ఈ వార్తలను కూడా చదవండి
ధారకొండ ఘాట్ రోడ్డులో ప్రమాదం
వెంకటేశ్వరకాలనీలో కార్డన్సెర్చ్