లోక్సభలో బిల్లుకు ఆమోదం.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 29 , 2026 | 09:36 PM
లోక్సభలో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, 2026' ఆమోదం పొందిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అమరావతి, జులై 29: లోక్సభలో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, 2026' ఆమోదం పొందిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక చట్టం లక్షలాది మంది విద్యార్థుల కలలు, ఆకాంక్షలను పరిరక్షించడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే దేశ పరీక్షా వ్యవస్థ సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని అభిప్రాయపడ్డారు.
పరీక్షా వ్యవస్థలో దీర్ఘకాలిక సంస్కరణల అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)తో పాటు దేశ పరీక్షా వ్యవస్థలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టిందని పవన్ కల్యాణ్ తెలిపారు. విద్యార్థుల కలలను కాపాడటం, విద్యాసంస్థల విశ్వసనీయతను నిలబెట్టడం, ప్రతిభ, నిజాయతీ, సమాన అవకాశాలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థను నిర్మించడం మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భారత భవిష్యత్తును అరాచక శక్తులు కాదు, పట్టుదల, క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో జ్ఞానాన్ని అన్వేషించే యువ మేధావులే తీర్చిదిద్దుతారని, వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి విద్యార్థికి సాధికారత కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్
టీడీపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు: పల్లా శ్రీనివాసరావు