‘నంది’ ఉత్సవాలకు శ్రీకారం
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:34 AM
‘నంది అవార్డు’ల ప్రదానోత్సవాలకు ముహూర్తం కుదిరింది. సినిమా, టీవీ, నాటక రంగాలకు ఇచ్చే నంది అవార్డు ప్రదానోత్సవాలను డిసెంబరు 15 నుంచి జనవరి 18లోపు నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
తెనాలి కేంద్రంగా నాటకోత్సవాలు.. తిరుపతి వేదికగా టీవీ అవార్డులు
విశాఖ లేదా రాజమండ్రిలో సినిమా పండుగ
డిసెంబరు 15 నుంచి జనవరి 18లోపు పూర్తి: మంత్రి దుర్గేశ్
అమరావతి, రాజమహేంద్రవరం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘నంది అవార్డు’ల ప్రదానోత్సవాలకు ముహూర్తం కుదిరింది. సినిమా, టీవీ, నాటక రంగాలకు ఇచ్చే నంది అవార్డు ప్రదానోత్సవాలను డిసెంబరు 15 నుంచి జనవరి 18లోపు నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. నాటకోత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలోనూ, టీవీ ఆవార్డు ప్రదానోత్సవాలను తిరుపతిలోనూ, సినిమా అవార్డు ఉత్సవాలను విశాఖ లేదా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తామని ఆయన వివరించారు. సినిమా, టీవీ రంగాల నంది అవార్డులను ఈ వారంలో ప్రకటిస్తామని వెల్లడించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఎండీ విశ్వనాథన్తో కలసి మంత్రి దుర్గేశ్ విలేకరుల సమావేశంలో నంది నాటకోత్సవాల వివరాలను వెల్లడించారు.
కందుకూరి అవార్డుల సంఖ్య పెంపు
‘గతంలో మూడుగా ఉన్న కందుకూరి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఐదుకి పెంచాం. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేస్తాం. స్థానం నరసింహారావు, ఆచార్య ఆత్రేయ, గరికపాటి రాజారావు, బండారు రామారావు తదితర దిగ్గజాల పేర్లతో ఈ పురస్కారాలు ఉంటాయి’ అని మంత్రి తెలిపారు.
నంది నాటకాల ఎంపిక ఇలా..
రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల
అక్టోబరులో సెలక్షన్ కమిటీ నియామకం
డిసెంబరులో ఎంపికైన నాటకాల జాబితా ప్రకటన
జనవరి 10న ప్రతిష్ఠాత్మక కందుకూరి అవార్డుల ప్రదానం
అదే రోజు నంది నాటకోత్సవాలు ప్రారంభం
వారంపాటు ఎంపికైన నాటకాల ప్రదర్శనలు
చివరి రోజు నంది నాటకోత్సవ పురస్కారాల ప్రదానం
ఈ వార్తలనూ చదవండి...