రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై మంత్రి అనగాని హామీ
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:27 PM
అమరావతిలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక హామీ ఇచ్చారు. వీఆర్వోలు, వీఆర్ఏలు, సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగ సంఘాలతో త్వరలోనే సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 18: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. వీఆర్వోలు, వీఆర్ఏలు, సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు.. వారి డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు గతంలో నిలిపివేసిన డీఏలను తిరిగి కొనసాగించాలని రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ రవీంద్రరాజు మంత్రిని కోరారు.
సర్వేయర్ల పే స్కేల్ పెంచాలని, వారికి డైలీ, ట్రావెల్ అలవెన్స్ సౌకర్యాలు కల్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే వీఆర్ఏలు ఉద్యమం చేపట్టారని.. సర్వేయర్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతూ నోటీసులు ఇచ్చారని రవీంద్రరాజు తెలిపారు. వీఆర్వోలు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారని వెల్లడించారు. సమస్యలు మరింత తీవ్రం కాకముందే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చూపాలని జేఏసీ నేతలు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అనగాని.. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం డిమాండ్లపై త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read:
ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్పాల్ సింగ్
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..