ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం!
ABN , Publish Date - Apr 10 , 2026 | 07:41 PM
రాజమండ్రి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని శ్రీ రామారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివరాల్లోకి వెళితే..
అనపర్తి, ఏప్రిల్ 10: రాజమండ్రి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని శ్రీ రామారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన ఆయన స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసిన ఎమ్మెల్యే, ఆహార నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూర ఏమాత్రం రుచికరంగా లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆయన అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఇలాంటి నాణ్యత లేని భోజనం పెట్టడంపై ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. ‘ మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ పనితీరుపై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ట్రస్ట్ నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదు’ అని అన్నారు. అనంతరం భోజన పథకం నిర్వహణలో జరుగుతున్న పొరపాట్లు, నాణ్యతా లోపాలపై ఎమ్మెల్యే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించిన ఆయన, అధికారుల తీరులో మార్పు రాకపోతే ఈ విషయాన్ని నేరుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
వైసీపీ నేతలది గుంట నక్కల రాజకీయం: కేంద్ర మంత్రి రామ్మోహన్