మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు స్వీకరించిన మంత్రి పొంగూరు
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:44 PM
గుంటూరు జిల్లాలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా అర్జీలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ మంగళగిరి టీడీపీ కార్యాలయాన్ని ఆశ్రయించిన ప్రజలకు మంత్రి పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు..
గుంటూరు, ఆగస్టు 24: గుంటూరు జిల్లాలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పోలీస్, భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వచ్చాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భూ సమస్యలు, రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న అంశాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పార్టీ గ్రీవెన్స్ ద్వారా ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. వచ్చిన ప్రతి అర్జీని నమోదు చేసి.. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఫాలోఅప్ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలకు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..
ఈ సందర్భంగా పొంగూరు నారాయణ మాట్లాడుతూ..‘ ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత రెవెన్యూ మంత్రితో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చాం. టీడీపీ కార్యాలయం కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలు విని.. పరిష్కారం చూపించే వేదికగా పనిచేస్తోంది. ప్రజల సమస్యలను మంత్రులు.. ప్రజాప్రతినిధులు నేరుగా స్వీకరించి పరిష్కరించే విధంగా గ్రీవెన్స్ వ్యవస్థ కొనసాగుతోంది. మంత్రి నారా లోకేశ్ సైతం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ మూలన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమం’ అని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు తానే..
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్!