అలిపిరి కాలినడక మార్గంలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
ABN , Publish Date - Jul 11 , 2026 | 07:38 AM
తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో రాత్రి సమయంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో హఠాత్తుగా చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురై కేకలు వేస్తూ పరుగులు తీశారు..
తిరుపతి, జులై 11: తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో రాత్రి సమయంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. నడకమార్గంలో చిరుత సంచరించిన ఘటనపై టీటీడీ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా స్పందించారు. శుక్రవారం రాత్రి నరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిరుతను చూసి.. భక్తులు కేకలు వేస్తూ పరుగులు తీశారు.
ఈ నేపథ్యంలో.. కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు ప్రయాణించే భక్తుల కోసం అధికారులు కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు భక్తులు ఒంటరిగా వెళ్లకుండా, గుంపులుగా ముందుకు సాగాలని సూచించారు. చిన్న పిల్లలతో వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని హెచ్చరించారు. అటవీ సిబ్బంది నడకమార్గ పొడవునా గస్తీ నిర్వహిస్తూ, సీసీ కెమెరాల ద్వారా వన్యమృగాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా భద్రతా సిబ్బంది సూచనలను పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి
ఉదయాన్నే ఈ పనులు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు..
కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలు..