Share News

వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలు..

ABN , Publish Date - Jul 10 , 2026 | 08:20 AM

గ్వాంగ్జీ‌లో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్‌ఝౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి.

వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలు..
900 snakes escape

బీజింగ్, జులై 10: చైనాలో 'మైసాక్' తుఫాను అలజడి సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో గ్వాంగ్జీ ప్రావిన్స్‌తో పాటు హెంగ్‌ఝౌ, నాన్నింగ్ నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చైనా వ్యాప్తంగా దాదాపు 62 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గల్లంతయ్యారు. వరద నీటి బీభత్సానికి దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో ఉన్న నాన్నింగ్ నగరంలోని రిజర్వాయర్ కట్ట తెగిపోయింది. దీంతో వరద నీరు హెంగ్ఝౌ నగర వీధులను ముంచెత్తింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.


అలజడి సృష్టిస్తున్న పాములు..

గ్వాంగ్జీ‌లో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్‌ఝౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. పాముల కారణంగా జనం కంటి మీద కునుకులేకుండా అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళను పాము కాటేసింది. వరదల కారణంగా రోడ్డు బ్లాక్ అవ్వటంతో ఆస్పత్రికి తరలించటం ఆలస్యం అయింది. ఆమె మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.


పాముల బెడద తారాస్థాయికి చేరటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పాము కాటుకు గురైన వారికి తక్షణమే చికిత్స అందించడానికి వీలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక మెడికల్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ఇక, వరద నీటిలో పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి

ఉదయాన్నే ఈ పనులు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

Updated Date - Jul 10 , 2026 | 08:21 AM