19న రెవెన్యూ జేఏసీ అత్యవసర సమావేశం
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:08 AM
ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర సమావేశం ఈ నెల 19న విజయవాడలో నిర్వహించనున్నట్టు జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు.
విజయవాడ: ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర సమావేశం ఈ నెల 19న విజయవాడలో నిర్వహించనున్నట్టు జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. రాష్ట గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశం అదే రోజు నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీఆర్ఏ, వీఆర్వో, సర్వేయర్ల సమస్యలపై అనేకసార్లు రాష్ట్ర ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు.
దీనిపై ఇప్పటికే వీఆర్ఏల జేఏసీ నేతలు ఐక్య ఉద్యమానికి పిలుపునిచ్చారని తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద వీఆర్ఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని, ఈ నిరసనలకు ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ మద్దతు ఇచ్చిందని వెల్లడించారు. అదే విధంగా ఈ నెల 17, 18, 19 తేదీల్లో సీసీఎల్ఏ కార్యాలయం వద్ద నిర్వహించే రిలే నిరాహార దీక్షలకూ మద్దతు ప్రకటించారు.