ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:45 AM
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది.
కడప: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ (శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు మొదలుపెట్టింది.
ఈ మేరకు దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. హైదరాబాద్, పులివెందులలోని అవినాశ్ రెడ్డి నివాసాలు సహా ఆయన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నారు. అలాగే అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు.
మరోవైపు, ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లపైనా ఈడీ అధికారులు దాడులకు దిగారు. పులివెందులలోని దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే, పులివెందులలోని జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బీసీ రిజర్వేషన్లపై మేమైతే కోర్టుకు వెళ్లం
దక్షిణాది ప్రగతికి కలిసి కదులుదాం