మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేశారు: మంత్రి లోకేశ్..
ABN , Publish Date - May 22 , 2026 | 07:49 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్భుత నటుడని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. సినిమాల్లో నటిస్తే జగన్కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎద్దేవా చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్భుత నటుడని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. సినిమాల్లో నటిస్తే జగన్కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎద్దేవా చేశారు. ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారని.. ఇంకో చెల్లి తండ్రిని చంపి అన్యాయం చేశారంటూ మంత్రి ఆరోపించారు. సొంత జిల్లా ప్రజలను మోసం చేశారని.. సొంత బాబాయిని లేపేసి నెపం టీడీపీపై నెట్టారని మండిపడ్డారు.
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో లోకేశ్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. వైఎస్ వివేకాది గుండెపోటు కాదని.. గొడ్డలి పోటు అంటూ ఆరోపణలు గుప్పించారు. గతంలో జగన్ కోడికత్తి, గులకరాయి డ్రామాలు చూశామని.. మొన్న కడపలోనూ అలాంటి కుట్రే జరిగిందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారని.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. రప్పా, రప్పా అంటే భయపడేవారు ఎవరూ లేరని.. మీ నాయకుడిని, వారి తండ్రినీ చూశామని వైసీపీ కార్యకర్తలకు చురకలు అంటించారు.
రప్పా, రప్పాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత తనదంటూ మంత్రి లోకేశ్ తేల్చి చెప్పారు. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారని.. చివరకు ఎర్ర కారు చూసినా బెదిరిపోతున్నారని వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ రెడ్డి వారంలో ఒక రోజు మాత్రమే ఏపీలో ఉంటున్నారని.. మూడు రోజులు బెంగళూరులో, మరో మూడు రోజులు హైదరాబాద్లో ఉంటున్నారని లోకేశ్ తెలిపారు. జగన్కు సీసీడీ (క్రెడిట్ చోరీ డిజార్డర్) వ్యాధి ఉందని.. వైసీపీ కుట్రలపై అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో జమ్మలమడుగుకు అనేక పరిశ్రమలు వస్తాయని తెలిపారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ను 2029 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కష్టకాలంలో పసుపుజెండాకు అండగా నిలబడిన వ్యక్తి భూపేశ్ రెడ్డి అని మంత్రి ప్రశంసించారు. ఆయనకు మాటలు తక్కువ.. చేతలు ఎక్కువని కొనియాడారు. జమ్మలమడుగు జోష్ అదిరిపోయిందని.. గండికోటను, టీడీపీని ఎవరూ టచ్ చేయలేరని మంత్రి లోకేశ్ తేల్చి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైఎస్ జగన్ శాంతి దూతలా ప్రవచనాలు చేస్తున్నారు: ఎంపీ కేశినేని చిన్ని
ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..