జమ్మలమడుగులో జేఎస్డబ్ల్యూ మెగా పెట్టుబడులు.. నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ABN , Publish Date - Jul 03 , 2026 | 09:35 AM
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
కడప, జూన్ 03: జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం11.10 గంటలకు ఆయన ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. అందుకోసం తిరుపతి నుంచి నేరుగా ఆయన సున్నపురాళ్లపల్లికి చేరుకుంటారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన అనంతరం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన చేస్తారు.
మొత్తం 1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ను జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేస్తుంది. తొలి దశలో రూ.4,500 కోట్లు.. మలి దశలో రూ.11,850 కోట్లు పెట్టుబడిగా ఆ సంస్థ పెడుతుంది. ఇక రూ.20,350 కోట్ల పెట్టుబడితో 3,850 మెగావాట్ల సామర్థ్యంతో ఎనర్జీ ప్లాంట్ను జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేస్తుంది. సోలార్ అండ్ విండ్ ద్వారా 3,850 మెగావాట్లను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. స్టీల్ ప్లాంట్తోపాటు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 2,700 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన జరగనుంది.