భారత్-ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్ దౌత్యవేత్త
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:00 PM
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో భారత్-ఇరాన్ మైత్రి సభ అత్యంత ఘనంగా నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం, ఏప్రిల్ 23: విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖమేనీ సంస్మరణ సభ, భారత్-ఇరాన్ మైత్రి సభ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇరాన్ దౌత్యవేత్త డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ.. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను, గాంధీజీపై తమకున్న గౌరవాన్ని చాటిచెప్పారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ అంటే ఇరాన్ దేశానికి ఎంతో గౌరవమని దౌత్యవేత్త పేర్కొన్నారు.
డాక్టర్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘ఇరాన్లో గాంధీజీ పేరుతో ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రి, కళాశాల ఉన్నాయి. ప్రతి ఏటా జనవరి 30న ఇరాన్లో గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, భారతీయుల మధ్య ఉన్న సోదరభావం ప్రపంచానికే ఆదర్శం. భారత్-ఇరాన్ దేశాల మధ్య దాదాపు 5 వేల ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక అనుబంధం ఉంది. రాబోయే రోజుల్లో విద్య, ఉపాధి, వ్యాపార రంగాలలో భారత్-ఇరాన్ మైత్రి మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నా. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖమేనీ అద్దె ఇంట్లోనే ఉన్నారు. యుద్ధ సమయంలో పారిపోకుండా ప్రజల మధ్యే ఉండి పోరాడిన ధీశాలి’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడవ రోజు సింగపూర్ పర్యటన.. PSA పోర్టును సందర్శించిన ఏపీ మంత్రుల బృందం
సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత