Share News

గుంటూరు జీజీహెచ్‌లో.. మళ్లీ ఉచిత మోకీలు సర్జరీలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 07:31 AM

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేలా కీలక ముందడుగు పడింది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి (జీజీహెచ్‌)లో రెండేళ్లుగా నిలిచిపోయిన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను తిరిగి ప్రారంభించనున్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో.. మళ్లీ ఉచిత మోకీలు సర్జరీలు

  • 100 ఇంప్లాంట్లు ఇచ్చేందుకు ఉన్నతి ఫౌండేషన్‌ సిద్ధం

  • వచ్చే నెల నుంచి ఆపరేషన్లు: సూపరింటెండెంట్‌ దుర్గాప్రసాద్‌

గుంటూరు: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేలా కీలక ముందడుగు పడింది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి (జీజీహెచ్‌)లో రెండేళ్లుగా నిలిచిపోయిన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబరు నుంచి పేద రోగులకు ఉచితంగా టోటల్‌ నీ రీప్లేసమెంట్ (టీకేఆర్) ఆపరేషన్లు ప్రారంభిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. పదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అందజేసిన నిధులతో వంద మంది రోగులకు, గుంటూరుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్‌ ద్వారా మరో 25 మందికి మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు.


అయితే నిధుల కొరతతో కొంతకాలంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ కీళ్ల మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జీజీహెచ్‌లో... దశాబ్దం క్రితం ఇక్కడే ఉచితంగా మోకీలు మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న 125 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు తిరిగి నిర్వహించేందుకు కోటి రూపాయల విలువైన 100 నీ ఇంప్లాంట్లు అందజేయడంతో పాటు శస్త్రచికిత్సల్లో తగిన సాంకేతిక సహకారం అందిస్తామని ఉన్నతి ఫౌండేషన్‌ చైర్మన్‌, జాయింట్‌ రీప్లేస్మెంట్‌ సీనియర్‌ సర్జన్‌ డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ప్రకటించారు.


ఈ మేరకు జీజీహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారి మాట్లాడుతూ... జీజీహెచ్‌లో 125 మంది రోగులకు మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరగ్గా, ఒక్క కేసులో కూడా ఇన్‌ఫెక్షన్‌, ఇతర ఇబ్బందులు తలెత్తలేదని పేర్కొన్నారు.


సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆదుకోవాలి..

మోకీలు మార్పిడి ఆపరేషన్ల కోసం వేలాది మంది పేద రోగులు ఎదురు చూస్తున్నారని డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వాస్పత్రుల్లో నీ ఇంప్లాంట్లకు నిధులు అందజేసి ఈ ఆపరేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Aug 13 , 2026 | 07:35 AM