అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:17 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, నియోజకవర్గాల కోసం పని చేయకపోతే మీరెందుకంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం, నియోజకవర్గాల కోసం పని చేయకపోతే మీరెందుకంటూ ఎమ్మెల్యేలపై ప్రశ్నల వర్షం గుప్పించారు. అసెంబ్లీకి రాకపోతే జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలని సూటిగా ప్రశ్నించారు.
ఇదే విషయాన్ని స్పీకర్ల కాన్ఫరెన్స్లోనూ తీర్మానించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి రాని వారికి జీతభత్యాలు ఇవ్వకూడదంటే దానిపైనా చర్చ చేస్తున్నారని ఆగ్రహించారు. ఒకప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రసంగాలు చూసి.. మళ్లీ ఎప్పుడు సమావేశాలు నిర్వహిస్తారా? అని ఎదురు చూసేవాళ్లమని అన్నారు. నేడు అసెంబ్లీలో అలా మాట్లాడే వారు ఎవరైనా ఉన్నారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సమావేశాల్లో బూతులు తిట్టుకోవడమే సరిపోతుందని వ్యాఖ్యానించారు. నేటి రాజకీయాల్లో పూర్తిగా విలువలు పోయాయని స్పీకర్ అన్నారు.
మరోవైపు, తెలుగు భాషను ప్రోత్సహించడంపైనా అయ్యన్నపాత్రుడు స్పందించారు. మన భాషను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. తెలుగును శాసనసభలో ప్రోత్సహించడం కోసం సభాపతిగా తాను బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే తెలుగులో మాట్లాడితేనే మైక్ ఇస్తానని, లేదంటే మైక్ కట్ చేస్తానని తేల్చి చెప్పారు. మండలి వెంకట కృష్ణారావు, వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ వంటి వారిని నేటి తరం నేతలు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ లిక్కర్ స్కాం.. A9 కిరణ్కుమార్రెడ్డికి ఈనెల 18 వరకు రిమాండ్
మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్రెడ్డి బదిలీ చేశారు: కిషన్రెడ్డి