ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 04 , 2026 | 06:52 PM
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాలు కల్పన ఊపందుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
అమరావతి, మార్చి 04: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయా అంశాలపై బుధవారం నాడు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ.. ‘విద్యాశాఖలో ఐటీని వినియోగించుకున్న అనంతరం ఏఐను సైతం వినియోగించుకుంటున్నారు.
మధ్య తరగతి, పేదవారికి యూనివర్సల్ హెల్త్ కవరేజి తేవడంతోపాటు ప్రతి ఒక్కరికీ రూ.2.50లక్షల ఇన్సూరెన్స్ ఎన్డీయే ప్రభుత్వం చేసింది. పేద వారికి వైద్యం కోసం ప్రతి ఒక్కరికీ రూ.20లక్షల వరకూ ఖర్చు చేయడానికి సిద్ధం. పీపీపీ కింద కాలేజీల నిర్మాణం చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తాం.
పీపీపీ అంటే ప్రైవేట్ కాదు.. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మాత్రమే. మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలి. అందుకే దానిని మనం ప్రోత్సహిస్తున్నాం గత పాలనలో చాలా పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. బ్రాండ్ పోతే చాలా కష్టం. ఆర్బీఐ ఇటీవల ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అయితే దీని ప్రకారం మన రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు తగ్గిపోయాయి.
గత ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహించింది తప్ప ఒక్క డీఎస్సీ, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం.. దాన్ని నిలబెట్టుకుంటాం. మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఉద్యోగాలు కల్పించే కమిటీ చాలా బాగా పనిచేస్తోంది. టూరిజానికి పరిశ్రమల స్థాయి కల్పించాం. నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ పెడుతున్నాం. ఎంఎస్ఎంఈలలో సుమారు 2.40లక్షల వరకూ ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు 30,500కు పైగా ఇచ్చాం. రాష్ట్రంలో ఇప్పటివరకూ 6,28,327మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
20నెలల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకే మాటగా నిలబడ్డాయి. ఒక్క రూపాయికి విశాఖలో భూమి కేటాయించాలన్నప్పుడు నేను ఆలోచించా. అయితే మొదట టీసీఎస్కు ఇచ్చాం. ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి. గత 20 నెలల్లో అనేక కంపెనీలు విశాఖకు క్యూ కట్టాయి. ఆర్సెలర్ మిట్టల్ 69 వేల కోట్ల ఫేజ్ వన్ను ప్రారంభిస్తారు. అందుకు మార్చి 26న భూమి పూజ చేస్తాం. ఏప్రిల్ నెలలో విశాఖలో గూగుల్కు భూమి పూజ చేస్తాం. ఇకపై ఎవ్వరూ ప్రభుత్వం వద్దకు వచ్చే అవసరం లేకుండా వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆన్లైన్లోనే అందిస్తాం. అతిథి దేవోభవ మన విధానం.... టూరిజం మా ప్రయారిటీ' అని చెప్పారు.
విశాఖ సమ్మిట్ గేమ్ చేంజర్..
విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్తో దూకుడు.. 15 రంగాల్లో 613 ఒప్పందాలు తద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16.13 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ఇప్పటి వరకు 20 నెలల్లో 15 సార్లు ఎస్ఐపీబీ సమావేశం జరిగిది. అందులో మొత్తం 237 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. రూ.9,03,562 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే 72 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం.
ఎస్ఐపీబీ ఆమోదంతో 8,54,817 ఉద్యోగాలు వస్తున్నాయి.
77,469 మంది నిరుద్యోగ యువతకు స్కిల్ ట్రైనింగ్తోపాటు వర్క్ ఫ్రమ్ హోం ఫెసిలిటీ కల్పిస్తాం.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్. అలాగే రాష్ట్రానికి ఎల్జీ, ఐబీఎం, కాగ్నిజెంట్, సిఫీ, బీపీసీఎల్, టాటా పవర్, రెన్యూ పవర్, తాజ్, ఐటీసీ, రిలయన్స్, రేమాండ్ వంటి బడా సంస్థలు వస్తున్నాయి.
20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.
కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం 6,28,347 ఉద్యోగాలు సాకారమయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 ద్వారా డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి చేశాం.
ఎంఎస్ఎంఈల నుంచి ఉపాధి: 2,48,906.
జాబ్ ఫెయిర్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627.
పరిశ్రమల రంగం: 95,174; ఫుడ్ ప్రాసెసింగ్: 64,035
ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్: 13,866, పర్యాటక రంగం: 5,028
ప్రాంతాల వారీగా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం..
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నాం. 2047 నాటికి విశాఖ రీజియన్లో 800 బిలియన్ డాలర్ల జీడీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేశాం. ఐటీ, జీసీసీ, డేటా సెంటర్ హబ్గా విశాఖపట్నం. క్వాంటం సిటీగా అమరావతి. రాయలసీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్టికల్చర్ ప్రాధాన్యం. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్ – అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్. నెల్లూరులో రూ.95 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. సీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నాం.
అసెంబ్లీలో పర్యాటక రంగం - ప్రగతిపై చర్చలో ముఖ్యమంత్రి
అతిథి దేవోభవ అనేది మన విధానం. ఆత్మీయత పంచడంలో మనల్ని మించిన వారు లేరు. టూరిజం కేవలం ఆదాయ వనరు కాదు. తెలుగు నేల సంస్కృతి, సంప్రదాయాలను దశదిశలా చాటే వేదిక.
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాం. క్యాపిటల్ సబ్సిడీ, SGST రీయింబర్స్మెంట్, స్టాంపు డ్యూటీ మినహాయింపులు, పారదర్శక భూ కేటాయింపులు వంటి చేశాం.
హోటళ్లు, రిసార్టులు, టెంట్ సిటీలు, థీమ్ పార్కులు, MICE (Meetings, Incentives, Conferences and Exhibitions) మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులు వచ్చాయి.
దీంతోపాటు పర్యాటక ఉపాధి, కారవాన్, హోమ్స్టే, బి అండ్ బి విధానాలు.. అడ్వెంచర్ స్పోర్ట్స్ మార్గదర్శకాలను రూపొందించాం. టెంపుల్ టూరిజానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
విశాఖ భాగస్వామ్య సదస్సులో టూరిజం రంగంలో 102 MoUల ద్వారా రూ.18,448 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 3,06,648 ఉద్యోగాలను రాబోతున్నాయి.
రూ.9,446 కోట్ల పెట్టుబడితో 7,348 క్లాసిఫైడ్ హోటల్ గదులకు SIPB ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మరో 47,118 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
ఎనిమిది ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం రూ.428 కోట్ల మేర నిధులను గ్రాంట్ను అందించింది.
రూ.98 కోట్లతో సూర్యలంక బీచ్, రూ.94 కోట్లతో అఖండ గోదావరి, రూ.78 కోట్లతో గండికోట గార్జ్, రూ.54 కోట్లతో సింహాచలం PRASHAD ప్రాజెక్ట్, రూ.30 కోట్లతో బొర్రా గుహలు, రూ.25 కోట్లతో అహోబిలం, రూ.25 కోట్లతో నాగార్జునసాగర్ బౌద్ధ సర్క్యూట్ చేపట్టాం.
క్రూయిజ్లు, కారవాన్లు, టెంట్ సిటీలు, హౌస్బోట్లను అందుబాటులోకి తెచ్చారు. 1,855 హోమ్స్టేలను (5,446 గదులు) అనుసంధానించారు.
7 మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించి పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.