Share News

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:15 AM

ఏపీని దేశంలోనే ప్రముఖ షిప్‌ బిల్డింగ్‌, మెరైన్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో ముందడుగు పడింది. రూ.15వేల కోట్ల పెట్టుబడితో దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌ నిర్మాణానికి మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌

  • ఎండీఎల్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం

  • సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

  • 15 వేల కోట్ల పెట్టుబడి.. 45,000 మందికి ఉపాధి

  • అనుబంధ పరిశ్రమలు, మెరైన్‌ ఇంజనీరింగ్‌,

  • లాజిస్టిక్స్‌తో మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఏపీని దేశంలోనే ప్రముఖ షిప్‌ బిల్డింగ్‌, మెరైన్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో ముందడుగు పడింది. రూ.15వేల కోట్ల పెట్టుబడితో దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌ నిర్మాణానికి మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్‌, ఏపీ మారిటైమ్‌ బోర్డు-విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ), నేషనల్‌ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌ ఏపీ మధ్య ఈ ఎంవోయూ జరిగింది. దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌ ఏర్పాటుకు ఎండీఎల్‌ వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు అనుబంధ పరిశ్రమలు, మెరైన్‌ ఇంజనీరింగ్‌, లాజిస్టిక్స్‌, సర్వీసెస్‌ ద్వారా మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఏటా 12 లక్షల టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యంతో ప్రతిపాదిత షిప్‌యార్డ్‌ రూపుదిద్దుకోనుంది.


ట్యాంకర్లు, బల్క్‌ క్యారియర్లు, కంటైనర్‌ నౌకలు, ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేస్తారు. దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్‌ కమ్‌ పోర్ట్‌ క్లస్టర్‌ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నో-ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ ప్రకారం షిప్‌బిల్డింగ్‌, షిప్‌ రిపేర్‌ యార్డ్స్‌ సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి సుమారు రూ.9,513 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. దుగరాజపట్నం పోర్టు అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇప్పుడు షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వ షిప్‌ బిల్డింగ్‌ డెవల్‌పమెంట్‌ స్కీం కింద అభివృద్ధి చేస్తారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఏపీ మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఎండీఎల్‌ సీఎండీ కెప్టెన్‌ జగ్మోహన్‌, విశాఖ పోర్ట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ జస్మీత్‌సింగ్‌ బింద్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 04:15 AM