కాపులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు: ఎమ్మెల్యే గోరంట్ల
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:12 PM
తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. కాపు సామాజిక వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలను బ్లూ మీడియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు..
రాజమండ్రి, ఏప్రిల్ 22: తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. కాపు సామాజిక వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలను బ్లూ మీడియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే సాక్షి పత్రికపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలు సృష్టించి.. రాజకీయ పబ్బం గడుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని గోరంట్ల ఆరోపించారు. ‘కులాల మధ్య చిచ్చు పెడుతుంటే మేము చూస్తూ ఊరుకోం.. రాజకీయంగా పతనం కావడంతోనే జగన్ ఇలాంటి అరాచకాలకు తెరలేపారు’ అని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ.. ‘రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన, బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా సహించేది లేదు. నా వ్యాఖ్యలను సాక్షి పత్రిక వక్రీకరించింది. జగన్ ఒక 'సూసైడ్ స్క్వాడ్'ను తయారు చేశారు. విచ్ఛిన్న శక్తులకు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మారింది. దేవాలయాలు, వ్యక్తుల పైనా దాడులు చేయిస్తున్నారు. జక్కంపూడి రాజా లాంటి వాళ్ళను పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి కంబాల చెరువు, దేవిచౌక్ ప్రాంతాలను అభివృద్ధి పేరుతో కంపుకొట్టించారు. కుర్రాళ్లు వాస్తవాలు తెలుసుకొని రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడితే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తున్నారు. సిగ్గులేకుండా ఇసుక గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా.’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం
అమరావతి పనులకు వేగంగ ఇసుక, కంకర