తప్పుడు పత్రాలతో రుణాలు.. 11 కోట్ల స్కాంలో నిందితుడు అరెస్ట్
ABN , Publish Date - Aug 15 , 2026 | 06:45 AM
బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రుణాల పేరుతో భారీ మొత్తంలో బురిడీ కొట్టించిన కేటుగాడిని సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీఐడీ రీజినల్ అధికారి, అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హీన్ ఆ వివరాలను వెల్లడించారు.
రాజమహేంద్రవరం, (ఆంధ్రజ్యోతి): బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రుణాల పేరుతో భారీ మొత్తంలో బురిడీ కొట్టించిన కేటుగాడిని సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీఐడీ రీజినల్ అధికారి, అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హీన్ ఆ వివరాలను వెల్లడించారు. 2018-20 మధ్యకాలంలో కొవ్వూరుకు చెందిన కవల వెంకట నరసింహం వివిధ ఎస్బీఐ శాఖల్లో తప్పుడు పత్రాలు సమర్పించి వివిధ వ్యక్తుల పేర్లపై వారి ప్రమేయం లేకుండా ఏఏబీఎల్, ముద్ర రుణాలు పొందాడు. కొవ్వూరు మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.2.85 కోట్లు, ప్రక్కిలంక రూ.44.84 లక్షలు, కొవ్వూరు బజార్ బ్రాంచ్ రూ.1.26 కోట్లు, మరో బ్యాంక్లో రూ.6.47 కోట్లు తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకూ అతను సుమారు రూ.11 కోట్ల మేర ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది.
నిందితుడిపై కొవ్వూరు టౌన్ పీఎస్ల్లో నాలుగు కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ చెప్పారు. గతంలో నరసింహాన్ని ఢిల్లీలో కస్టడీలోకి తీసుకొని రాష్ట్రానికి తరలిస్తుండగా తప్పించుకు పోయాడని వెల్లడించారు. అప్పటి నుంచి అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నామన్నారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ అడిషనల్ ఎస్పీ, అధికారులు, సిబ్బందిని సీఐడీ డీజీపీ అభినందించారు. ఈ స్కాంలో ప్రమేయం ఉన్న ముగ్గురు బ్యాంకు మేనేజర్లను 6నెలల కిందట అరెస్టు చేయగా ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
Also Read..
పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికే పెద్దపీట!