703 ఏఐ పోస్టులు మంజూరు
ABN , Publish Date - Aug 15 , 2026 | 02:47 AM
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 703 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల (ఏఐ) పోస్టులను మంజూరు చేస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ప్రకాశం జిల్లాకు 241, మార్కాపురం జిల్లాకు 462 పోస్టులు ఇచ్చారు.
ప్రకాశంకు 241, మార్కాపురం జిల్లాకు 462 కేటాయింపు
ఒంగోలు విద్య, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 703 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల (ఏఐ) పోస్టులను మంజూరు చేస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ప్రకాశం జిల్లాకు 241, మార్కాపురం జిల్లాకు 462 పోస్టులు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు 104 సెకండరీ గ్రేడ్ కేడర్ ఏఐలు, 137 స్కూలు అసిస్టెంట్ క్యాడర్ పోస్టులు మంజూరు చేశారు. జిల్లాలోని 45 ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఒక టీచర్ కూడా లేరు. 36 స్కూళ్లలో ఒక్కో టీచర్ మాత్రమే పనిచేస్తున్నారు ఎస్జీటీ ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.10వేలు, స్కూలు అసిస్టెంట్కు రూ.12,250 గౌరవ వేతనం చెల్లిస్తారు. సెప్టెంబరు 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఎనిమిది నెలలపాటు వీరిని కొనసాగిస్తారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమే. వీరిని త్రిసభ్య కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీ చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా డీఈవో, సభ్యులుగా డైట్ ప్రిన్సిపాల్, ఉపవిద్యాధికారి వ్యవహరిస్తారు. ఈ పోస్టులకు సంబంధించి ఈనెల 14, 15 తేదీల్లో డీఈవో నోటిఫికేషన్ జారీచేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 16 నుంచి 21 వరకు ఎంఈవోలకు దరఖాస్తు చేసుకోవాలి. 29న ఎంపిక జాబితాలను సంబంధిత మండల విద్యాధికారులు, హెచ్ఎంలకు తెలియజేస్తారు. ఎంపికైన వారికి ఈనెల 30, 31 తేదీల్లో నియామకపు ఉత్తర్వులు ఇస్తారు. వచ్చేనెల 1న పాఠశాల విధుల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు చేరతారు.